వాతావరణంలో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న కొద్దిరోజులు దేశవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుకుంటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణ, ఢిల్లీ, ఛండీఘడ్, యూపీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మరాఠ్వాడా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1.6 నుంచి 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ, ఉక్కపోతలకు లోనయ్యే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. రానున్న ఐదురోజుల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతాయని పేర్కొంది. ఇక తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.