పళ్లలో పట్టేస్తారు...!

Forensic Odontology To Probe Into A Crime To Crack The Mystery - Sakshi

నేరపరిశోధనలో ‘ఫోరెన్సిక్‌ ఒడంటోలజీ’

మానభంగాలు.. హత్యలు... దోపిడీ కేసుల్లో కీలకం...

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్ఠించిన  ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం,హత్య కేసు విచారణలో భాగంగా ఈ పరిశోధన వెలుగులోకి వచ్చింది. దంతవైద్యశాస్త్రంతో ముడిపడిన  ఒడంటోలజీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫోటోల్లోని ముఖకవళికలను బట్టి  నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్‌కు పాల్పడిన వారిలో ఓ మైనర్‌ కూడా ఉండడంతో ) నిర్థారించారు.   నిర్భయ శరీరంపై æగాయాలను ఈ నిందితుల పలువరసను  పోల్చి చూడడం ద్వారా ఈ కేసును పరిష్కరించారు.

నేర పరిశోధనలో...మరీ   ముఖ్యంగా తీవ్రాతి తీవ్రమైన నేరాలు, క్రూరమైన పద్ధతుల్లో లైంగికహింస, దాడులు, హత్యలు సాగుతున్న ప్రస్తుత సందర్భంలో   ‘ఫోరెన్సిక్‌ ఒడంటోలజీ’ కీలకపాత్ర పోషిస్తోంది. దంతవైద్యశాస్త్రంతో  ముడిపడిన ఈ ఫోరెన్సిక్‌ సైన్స్‌ భారత్‌లో  ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా, లైంగికదాడులు,  ఇతర  హింసాత్మక  కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్‌ కే సులతో పాటు క్రీడాకారుల వయసు నిర్థారణ వివాదాల పరిష్కారానికి ఈ  పరిశోధన దోహదపడుతోంది.   అస్థిపంజరం, ఎముకల ద్వారా కంటే కూడా ఈ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిర్థారణ   పక్కాగా ఉంటుంది. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల  వయసు అంచనా ఓ ఏడాది అటూ ఇటూగా ఉంటే, అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా చేసే అంచనా మధ్య తేడా పదేళ్ల వరకు ఉండొచ్చునంటున్నారు.

ఫోరెన్సిక్‌ ఒడంటోలజీ లో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభ, నైపుణ్యాన్ని చాటుతున్నారు.  ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన  అనుభవమున్న వారు  దేశవ్యాప్తంగా కేవలం  పది మంది వరకే ఉన్నారు. వీరంతా కూడా విదేశాల్లోనే ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ఇలాంటి కేసులకు సంబంధించి వార్తలు పత్రికలో చూశాక,  తనకు తానే పోలీసుల వద్దకు వెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అందిస్తానంటూ తొలినాళ్లలో పాండే వంటి వాళ్లు చెప్పాల్సి వచ్చేది.  మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బందం ఓ గ్రూపు ఫోటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్థారించగలిగారు. ఫోటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిదినెలల తర్వాత డీఎన్‌ఏ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్‌నగర్‌ రేప్‌కేస్‌లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. దాదాపు పది,పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణురాలిగా సాక్ష్యమిచ్చారు.

మనదేశంలో అంతంతే...
భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్‌ గ్రాడ్యువేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే  పోస్ట్‌గ్రాడ్యువేషన్‌ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్‌ డెంటిస్ట్రీ’కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ ఒడొంటోలజీ ఓ సర్టిఫికెట్‌ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.  ఈ అసోసియేషన్‌ కార్యదర్శి డా. ఆషిత్‌ ఆచార్య  నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం కాలేజి ఆఫ్‌ డెంటల్‌సైన్సెస్‌ అండ్‌ హాస్పటల్‌లో ఆయన అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ,పురుషులవిగా ఆయన తన పరిశోధనలో నిగ్గు తేల్చారు.

దుర్భిక్షంగా కారణంగా వారంతా మరణించినట్టు వెల్లడించారు. అప్పటివరకు మొగల్‌ సైన్యం స్థానికులను సామూహికంగా హత్య చేసి ఉంటుందని అందరూ భావించారు.  హైదరాబాద్‌లోని పాణ నీయ  ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చీ ఫోరెన్సిక్‌ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్‌ బళ్లా వివిధకేసుల్లోని  దోషుల వయసు నిర్థారణలో తనవంతు కషి చేస్తున్నారు.   18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్థారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్‌ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్థారిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top