జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

Centre To Deploy Additional 10,000 Troops In Kashmir - Sakshi

కశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను పంపనున్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్లు సమాచారం. 

కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆయన కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమర్‌నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 40 వేల అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌కు పంపింది. అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాదాపు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి తరలివెళ్లాయి. లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే అదనపు బలగాలను పంపుతున్నట్టు అప్పట్లో కేంద్రం ప్రకటించింది.

భయబ్రాంతులకు గురిచేస్తున్నారు 
జమ్మూకశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను తరలించడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసేందుకే అదనపు బలగాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్‌లో శాంతి భద్రతలకు లోటు లేదని, అయినప్పటికీ బలగాలను తరలించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, వాటిని బలగాలతో పరిష్కరించలేరన్నారు. అదనపు బలగాల తరలింపుపై కేంద్రం మరోసారి పురరాలోచించాల్సిన అవరసరం ఉందన్నారు. కాగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top