అవార్డుల రేసులో జో, నయన్లు
తమిళసినిమా: నటి నయనతార, జ్యోతిక, విశాల్, భారతీరాజా తదితర 12 చిత్రాలు పోటీకి సిద్ధం అవుతున్నాయి. వీటిలో అవార్డులను గెలుచుకునే చిత్రాలు ఏమిటన్నది ఆసక్తిగా మారింది. వివరాల్లోకెళ్లితే ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకై చెన్నైలో 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుక జరగనుంది. 14వ తేధీన సాయంత్రం ఆరు గంటలకు స్థానిక ట్రిప్లికేన్లోని కలైవానర్ ఆవరణలో సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ప్రారంభం కానున్న ఈ చిత్రోత్సవాల్లో 12 తమిళ చిత్రాలు పోటీ పడనున్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి నగదు బహుమతులను అందించనున్నారు.
ఈ అవార్డులకు నయనతార నటించిన అరమ్, జ్యోతిక నటించిన మగళీర్మట్టుం, విశాల్ నటించిన తుప్పరివాలన్, దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్ర పోషించిన కురంగుబొమ్మై, విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రమ్వేదా, ఆండ్రియా నటించిన తరమణి, చిత్రాలతో పాటు 8 తోట్టాక్కల్, కడుగు, మానగరం, ఒరు కిడాయిన్కరుణై మణు, మనుషంగడా, ఒరు కుప్పైక మొదలగు 12 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇండో సినీ అప్పియేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ చిత్రోత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన 150 చిత్రాలను చెన్నై నగరంలోని దేవీ, దేవీబాల, సత్యం, క్యాసినో, ఠాగూర్ ఫిలింసెటర్, అన్నా, రష్యన్ కల్చరల్ సెంటర్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. వాటితో పాటు ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు ఎంపికైన 12 ఉత్తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు.