చక్రి భార్యకు అత్తింటి వేధింపులు? | chakri wife complains to hrc of harassment from in laws | Sakshi
Sakshi News home page

చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?

Dec 17 2014 4:31 PM | Updated on Sep 2 2017 6:20 PM

చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?

చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?

గుండెపోటుతో మరణించిన సంగీత దర్శకుడు చక్రి తల్లి, అక్కాచెల్లెళ్లు తనను వేధిస్తున్నట్లు ఆయన భార్య శ్రావణి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.

గుండెపోటుతో మరణించిన సంగీత దర్శకుడు చక్రి తల్లి, అక్కాచెల్లెళ్లు తనను వేధిస్తున్నట్లు ఆయన భార్య శ్రావణి ఆరోపించారు. చక్రిని చంపే ప్రయత్నం నువ్వే చేశావంటూ ఆమెను అత్తమామలు వేధించడం మొదలుపెట్టారని ఆమె అన్నారు. మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చక్రి, శ్రావణిలది ప్రేమవివాహం. పదేళ్ల క్రితం వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇటీవలి వరకు అయినవాళ్లంతా వాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా దగ్గరకు వస్తున్నారు. గతంలో శ్రావణి మీద దాడులు జరిగాయి. సుమారు నెల రోజుల క్రితం ఆమె అత్త, మరిది విడిగా వెళ్లిపోయారు. చక్రి మరణించిన తర్వాత వాళ్లంతా కలిసి చక్రి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ.. శ్రావణి కనీసం నీళ్లు తాగిందో లేదో కూడా చూడట్లేదని చెబుతున్నారు. చక్రికి ఎలాంటి ఆస్తులున్నాయో కూడా ఆమెకు తెలియదని అంటున్నారు.

కాగా, అత్తింటి వేధింపులపై స్పందించేందుకు సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి నిరాకరించారు. తన భర్త మరణించి ఇప్పటికి కేవలం మూడు రోజులే అయ్యిందని, అందువల్ల ముందు ఈ 11 రోజులు ఆయన కర్మకాండలన్నీ పూర్తి కానివ్వాలని ఆమె మీడియాను వేడుకున్నారు. ఇప్పుడు తానేమీ మాట్లాడే పరిస్థితిలో లేనని, కనీసం నిలబడే స్థితిలో కూడా లేనని చెప్పారు. తనకు మాటిమాటికీ స్పృహ తప్పుతోందని, నిన్న కూడా తాను ఫిట్స్తో పడిపోయానని అన్నారు. వేధింపులు ఉన్నట్లు ఏమైనా చెబుతారా అని అడగగా.. ఆ విషయం దేవుడికే తెలియాలంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

ఓసారి తనను వాళ్లు తల గోడకేసి కొట్టారని, కానీ ఆ విషయం ఆయన చూడలేదని శ్రావణి చెప్పారు. చక్రి ఆరోగ్యం గురించి ఫోన్లు చేసినా ఎవ్వరూ ఫోను ఆన్సర్ చేయలేదని తెలిపారు. తాను కనీసం చెప్పులు కూడా లేకుండా చక్రిని తీసుకుని అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లానన్నారు. వాళ్లు ఎప్పుడొచ్చారో తెలియదని, మధ్యాహ్నం ఫిలిం చాంబర్లో మృతదేహం ఉన్నప్పుడు.. వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తన కప్ బోర్డులన్నీ తాళాలు వేసేశారని, చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని అన్నారు. భర్తను చంపుకొనేదాన్ని కాదని, వాళ్లే ముందు ఇంట్లోంచి వెళ్లిపోయారని శ్రావణి తెలిపారు. కనీసం తనకు కట్టుబట్టలు కూడా లేవని, కప్ బోర్డుల తాళాలన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తనను బయటివాళ్లు తప్ప, ఇంట్లో వాళ్లు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిట్స్ వచ్చినా కూడా తన మొహం చూడలేదన్నారు. తనకు డబ్బు అక్కర్లేదని, డబ్బు ఆశించేదాన్ని కాదని తెలిపారు. తామిద్దరికీ ఎప్పుడూ గొడవలు లేవని, పొద్దున్న తన మొహం చూడకుండా లేవరని, కళ్లు మూసుకుని శ్రావణీ.. ఎక్కడున్నావని పిలిచేవారని వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement