‘బియాస్’లో కొట్టుకుపోయిన బాబు హామీ | nayani narsimha reddy gives Rs .1.50 lakh compensation for the families of the victim | Sakshi
Sakshi News home page

‘బియాస్’లో కొట్టుకుపోయిన బాబు హామీ

Aug 1 2014 12:56 AM | Updated on Oct 20 2018 5:03 PM

‘బియాస్’లో కొట్టుకుపోయిన  బాబు హామీ - Sakshi

‘బియాస్’లో కొట్టుకుపోయిన బాబు హామీ

కన్న బిడ్డలను కోల్పోయి దుఃఖంలో ఉన్న తమతో చంద్రబాబు రాజకీయ ఆటలు ఆడారని ‘బియాస్’ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.

పరిహారంపై మాట మార్చారంటూ బాధితుల ఆవేదన
 
సాక్షి, హైదరాబాద్: కన్న బిడ్డలను కోల్పోయి దుఃఖంలో ఉన్న తమతో చంద్రబాబు రాజకీయ ఆటలు ఆడారని ‘బియాస్’ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. హైదరాబాద్‌కు చెందిన విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 2న జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టూర్ ఆపరేటర్‌తోపాటు 24 మంది విద్యార్థులు మృతి చెందారు.
 
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన రూ.1.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సచివాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాల సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇస్తామన్న పరిహారం విషయంలో ఆయన మాట మార్చారని విమర్శించారు. మృతుల కుటుంబాలు ఏ ప్రాంతంవారని ఇప్పటివరకు ఎవరూ తమను అడగలేదని.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా అడిగారని రిథిమ తండ్రి శ్రీనివాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
 
చంద్రబాబు పట్టించుకోవడంలేదు
‘‘తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు పరిహారం ప్రకటించింది.  24 మంది విద్యార్థుల తల్లిదండ్రులం ఏపీ సీఎం చంద్రబాబును సోమవారం పార్టీ కార్యాలయంలో కలి శాం. ఇప్పుడు ఆయన మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాళ్లకు ఇచ్చుకోవాలి. ఒక ప్రభుత్వం ఇచ్చింది కదా.. మేం ఇవ్వకూడదు అని చెబుతున్నారు’’
- రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్, నల్లగొండ  
 
రూల్స్ వర్తిస్తాయా.. అని అన్నరు

‘‘ఒక రాష్ట్రం ఇచ్చింది.. మరో రాష్ట్రం ఇవ్వడానికి రూల్ వర్తిస్తుందో లేదో చూస్తాం అని చంద్రబాబు చెప్పారు. ఆంధ్ర సైడ్ పిల్లలకు కూడా ఇచ్చారా? అని అడిగారు. కేసీఆర్ సార్ అందరికీ ఇచ్చారని చెప్పాం. మేము కూడా ఇవ్వవచ్చునా అని మమ్మల్ని అడిగారు. మాకేం తెలుస్తుంది.’’    - రిథిమ తండ్రి పి.శ్రీనివాస్, చిత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement