కోర్టు ధిక్కార కేసులో ఐఏఎస్ అధికారిణులు నీలం సహానీ, కె. సునీత, కాలేజేట్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ ఎం.ప్రసాద రావులకు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.
గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో మైక్రో బయాలజీ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ దర్శి పేబే సారా తనను ఖాళీగా ఉన్న బోటనీ లెక్చరర్ పోస్టులో విలీనం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు సారా బోటనీ లెక్చరర్గా విలీనమయ్యేందుకు అనుమతినివ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ 2013లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలుచేయలేదంటూ విద్యాశాఖ అధికారులు నీలం సహానీ, సునీత, ప్రసాదరా వులపై సారా కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. ఆ మేరకు పై విధంగా ఆదేశాలిచ్చారు.