
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ..
గ్రేటర్ ఎన్నికలకు మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రేటర్లో150 వార్డులకు నోటిఫికేషన్ విడుదల అయింది.
♦ గ్రేటర్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు..
♦17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 18న స్క్రూటినీ
♦ ఉపసంహరణకు 21వరకు గడువు.. అదే రోజు తుదిజాబితా
సాక్షి, హైదరాబాద్: మహా నగరపాలక సంస్థ ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు ఎన్నికల నగరా మోగనుంది. గ్రేటర్ ఎన్నికలకు మంగళవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రేటర్లో150 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఈరోజు నుంచి 17వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. అయితే ఇందులో భోగి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 14, 15 తేదీల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు నాలుగు రోజులే గడువుంది. 17వ తేదీ ఆదివారం అయినా నామినేషన్లు స్వీకరిస్తారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీలోని 24 సర్కిళ్లలో ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. 18వ తేదీ సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. అభ్యర్థుల తుది జాబితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్గా రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు నామినేషన్ డిపాజిట్ చెల్లింపులో రాయితీ ఇచ్చారు. వీరు రూ. 2,500 చెల్లిస్తే సరిపోతుంది.