వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ | army and ndrf in rescue and relief in telangana | Sakshi
Sakshi News home page

వరద సహాయకచర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్

Sep 24 2016 12:45 PM | Updated on Sep 4 2017 2:48 PM

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది.


హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న భాగ్యనగరంలో వరద సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. మరి కొన్నిరోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద తగ్గే వరకూ సహకారం అందించాలని ప్రభుత్వం ఆర్మీకి విజ్ఞప్తి చేయడంతో.. నాలుగు ఆర్మీ బృందాలు బేగంపేట్, నిజాంపేట, హకింపేట, అల్వాల్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆర్మీ సహాయకచర్యలు చేపడుతోంది. ఆర్మీతో సమన్వయం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ తరఫున ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్మీ సిబ్బంది ఇప్పటికే ఆల్వాల్లో పర్యటించి అక్కడి వరద ప్రభావిత ప్రాంతంలో అందించడానికి మెడికల్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది.
 
మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రాష్ట్రంలో సహాయకార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని.. మరో రెండు బృందాలు పుణె నుంచి వస్తున్నాయని ఉన్నతాధికారులు మధుసూధన్రెడ్డి, సెల్వం వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో రెవెన్యూ శాఖ కార్యదర్శి కె. ప్రదీప్ చంద్రను వారు కలిశారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మధుసూదన్రెడ్డి, సెల్వం మాట్లాడుతూ... ఓ బృందాన్ని మెదక్ జిల్లాకు, మరో బృందాన్ని నిజామాబాద్ పంపిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు బృందాలు హైదరాబాద్లో పని చేస్తాయని వారు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement