పోలవరంపై పిల్లిమొగ్గలు!

K.Ramachandra Murthy writes on Polavaram project - Sakshi

త్రికాలమ్‌

రెండు ప్రభుత్వాల మధ్యా, ఇద్దరు రాజకీయ నేతల మధ్యా పోలవరం ప్రాజెక్టు నలిగిపోతోంది. టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌కు రాసిన లేఖపై వివాదం రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతలోనే నాలిక కరుచుకున్నారు. గుక్కతిప్పుకున్నారు. మాట సవరించుకున్నారు. నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టారు. ఆ ప్రయత్నంలో సైతం పప్పులో కాలేశారు. ఇంకా సమర్పించని మంజూనాథ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఆమోదించినట్టు ప్రకటించడం, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఒక తీర్మానాన్ని శాసనసభ చేత ఆమోదింపజేయడం చంద్రబాబునాయుడు మార్కు రాజకీయం. కేంద్ర వైఖరి పైన అసంతృప్తి ప్రకటించిన విషయం మరుగున పడటానికి కాపు రిజర్వేషన్‌ కార్డును ప్రయోగించారు. తాము నివేదిక ఖరారు చేశాము కానీ ప్రభుత్వానికి సమర్పించలేదని బీసీ కమిషన్‌ అధ్యక్షుడు మంజూనాథ్‌ శనివారం మీడియా ప్రతినిధులకు చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక తడబాటు వెల్లడైంది.

ఆగ్రహం, అంతలోనే అనునయం
పోలవరం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకూ ప్రయోజనం జరుగుతుంది. ఇది ఆ ప్రాంతానికి జీవధార. ప్రాజెక్టు నిర్మాణంపైన ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. నిర్మాణంలో జాప్యం జరిగితే ప్రజలు క్షమించరు. ప్రజల ఆగ్రహాన్ని ఎగదోసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలన్నది చంద్రబాబు వ్యూహమని సోము వీర్రాజు వంటి బీజేపీ నాయకులు కొందరు బహిరంగంగానే అంటున్నారు. మోదీ ప్రతిష్ఠ తగ్గుముఖం పట్టిందన్న అంచనా ఇందుకు కారణం. శుక్రవారం మధ్యా హ్నం ఉత్తరప్రదేశ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడం, బీజేపీ ఘనవిజయం సాధించడం గమనించిన చంద్రబాబు వెంటనే మోదీకి తెల్లజెండా చూపించారు.  

కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు ప్రదేశం సందర్శించి ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆయనను బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, మరి కొందరు బీజేపీ నాయకులూ కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమనీ, దానిలో జాప్యం జరిగితే బీజేపీకి చెడ్డపేరు వస్తుందనీ, పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనీ వారు మంత్రికి చెప్పారు. ‘కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లెక్క చెప్పమని మాత్రమే అడుగుతున్నాం’ అని ఆయన వివ రించారు. ‘గడ్కరీ గురించి తెలుసుకోమని చెప్పండి మీ ముఖ్యమంత్రికి. పోల వరం ప్రాజెక్టు ఆయన కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మించే సామర్థ్యం, వనరుల లభ్యత నాకుంది.  పోలవరం ప్రాజెక్టు  బాధ్యత  కేంద్ర ప్రభుత్వానికి వదిలేయమని మొన్న నాగపూర్‌లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చిలక్కి చెప్పినట్టు చంద్రబాబుకు  చెప్పాను. తానే చేస్తానంటారు. జమాఖర్చుల వివ రాలపైన∙కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమంటే చెప్పరు. గుడ్డిగా నిధులు ఇచ్చుకుంటూ పోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? నేను ఒప్పుకున్నా నన్ను ప్రధాని లెక్కలు అడుగుతారు. ఒక సంవత్సరంలోనే అంచనాలు మూడు సార్లు మార్చారు. ఒకసారి రూ. 33 వేల కోట్లు  అన్నారు. తర్వాత రూ. 40 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ. 50 వేల కోట్ల పైచిలుకు అంటున్నారు. ఇష్టం వచ్చిన అంకెలు చెప్పి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం ఎట్లా కుదురుతుంది? నేను అడిగేదల్లా పారదర్శకత పాటించమనే. అంతకీ సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చుకోమన్నాను. ప్రధాన కాంట్రాక్టర్‌ను మార్చవద్దని చెప్పాను. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా కోర్టుకు వెడితే ఇంకా జాప్యం జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారట.

టెండర్‌ తిరకాసు
టెండర్‌ వేయడానికి 45 రోజులు గడువు ఇవ్వాలన్నది నిబంధన. 18 రోజులు మాత్రమే ఇచ్చారు. టెండర్‌ నోటీసును ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నవంబర్‌ 25 వరకూ పెట్టలేదన్నది మరో ఆరోపణ. లెక్కలు చెప్పడం చంద్రబాబుకు అల వాటు లేని పని. ఆ మాటకొస్తే ఏ ముఖ్యమంత్రి కూడా లెక్కలు చెప్పవలసిన అవసరం రావడం లేదు. కాంట్రాక్టర్లతో మాట్లాడి అధికారులకు చెప్పి ప్రాజెక్టుల అంచనాలు పెంచడం ఆనవాయితీ. నామినేషన్‌ పద్ధతి మీద పనులు కేటాయిం చడం, మాటవరుసకు టెండర్లు పిలిచినా తాను ఎవరికి ఇవ్వాలని సంకల్పిం చారో వారికి మాత్రమే అర్హత ఉండే విధంగా నిబంధనలను రూపొందించడం, అనుకున్న అçస్మదీయులకే కట్టబెట్టడం చంద్రబాబు మార్కు పరిపాలన. ఆయ నను లెక్కలు అడిగే సాహసం అధికార పార్టీలో ఎవ్వరికీ లేదు. ప్రశ్నించే ప్రతి పక్షాలను ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయంటూ అడ్డగోలుగా నిందించడం, అడ్డంగా దబాయించడం అలవాటు చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశాలలో ముఖ్యమంత్రి చెప్పింది వినడమే కానీ వివరాలు అడిగే తెగింపు ఎవ్వరికీ లేదు. డూడూ బసవన్నల మాదిరి తలలూపడమే. స్వప్రయోజనాలు సాధించుకునే సావకాశం అందరికీ  కల్పించినప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవసరం ఎవ రికి మాత్రం ఉంటుంది? అమరావతి నిర్మాణంలో సింగపూరు మిత్రులకు పెద్ద పీట వేసినా, వేల ఎకరాలు పూలింగ్‌ పేరుతో సేకరించినా, తమకు ఇష్టమైన వారికి వందల ఎకరాలు కేటాయించినా అదేమని అడిగేవారు లేరు. తాను అను కున్న పనులు ఇంత సులువుగా, నిర్నిరోధంగా చేయగలుగుతున్న చంద్రబాబు కేంద్ర అధికారులు ‘క్వెరీ’లు (ప్రశ్నలు) వేస్తే సహించగలుగుతారా?

తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి  ఈ విషయంలో ముఖ్యమంత్రికీ, ఆయన సమర్థకులకీ తత్వం బోధపరిచారు. ‘రౌతు కొద్దీ గుర్రం అంటారు. రౌతు మనసు తెలుసుకొని గుర్రం నడుచుకుంటుంది. గుర్రం అధికారి, రౌతు మంత్రి’ అని జేసీ వివరించారు. అంటే గడ్కరీ రాయ మంటేనే అమర్‌జిత్‌ లేఖ రాశారని అర్థం. మంత్రి పురమాయిస్తేనే అధికారి లేఖ రాస్తాడు. పరిపాలనా పద్ధతులు తెలిసినవారికి ఈ విషయం స్పష్టం. తెలిసి కూడా ఆఫ్ట్రాల్‌ అధికారి రాసిన లేఖకు విలువేముందంటూ మాట్లాడటం రాజకీయం.

చంద్రబాబు వ్యవహార శైలి పట్ల ప్రధానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయనీ, ఒక ముఖ్యమంత్రి దేశప్రధానితో పోటీ పడి విదేశాలు సందర్శించడం, ప్రజాధనం ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో విదేశీ ప్రయాణాలు చేయడం ఆయనకు నచ్చడం లేదనీ బీజేపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యా నించారు. వేలకోట్ల రూపాయలు చిత్తం వచ్చినట్టు ఖర్చుపెడుతున్న ముఖ్య మంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేననీ, ఇది ప్రధానికి ఏ మాత్రం  సమ్మతం కాదనీ ఆయన అన్నారు. ‘అంతమంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొను గోలు చేయడానికి బాబుకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హెరిటేజ్‌ఫుడ్స్‌లో వచ్చిన లాభాల నుంచి ఖర్చు చేస్తున్నారా?’ అని కూడా ప్రధాని చమత్కరించా రని ఆ పార్లమెంటు సభ్యుడు చెప్పారు. చంద్రబాబు పట్ల నరేంద్రమోదీకి 2002 నుంచీ అమిత్రభావమే ఉన్నది. గుజరాత్‌లో మత కలహాలు జరిగిన సంద ర్భంలో మోదీ ‘రాజధర్మం’ పాటించాలని నాటి ప్రధాని వాజపేయి ఉద్బోధిం చారు. మోదీని గద్దె దించాలంటూ వాజపేయికి సలహా చెప్పినవారిలో చంద్ర బాబు ఒకరని మోదీ అనుమానం. మోదీకి జ్ఞాపకశక్తి ఎక్కువనీ, ఏ విషయం కూడా మరచిపోయే ప్రసక్తి లేదనీ, ఎవ్వరినీ క్షమించే ప్రశ్న కూడా లేదనీ బీజేపీ నాయకులు చెబుతారు. వయస్సు పైబడి ఆరోగ్యం సరిగా లేని ఎన్‌టి రామా రావుపైన వ్యూహాత్మక విజయం సాధించడం తేలికే. మోదీపై గెలవగలరా?

లెక్క చెబితేనే నిధులు
లెక్క చెప్పకపోతే నిధులు విడుదల చేసే ప్రసక్తి లేదని గడ్కరీ స్పష్టం చేస్తున్నారు. ప్రధానిని కలుసుకునే అవకాశమే లేదు. ఏదైనా సమావేశంలో కలిసినా ప్రధాని ముభావంగా, దూరదూరంగా ఉంటారే కానీ కుశల ప్రశ్నలు సైతం అడగడం లేదు. ఈ వాతావరణం కూడా చంద్రబాబుకు కొత్తే. లోగడ వాజపేయి ప్రధా నిగా, అడ్వాణీ ఉప ప్రధానిగా, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్‌లో కూర్చొని చక్రం తిప్పారు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎర్రన్నాయుడు సైతం వాజపేయికి నేరుగా ఫోన్‌ చేసి ‘హౌ ఆర్‌ యూ సార్‌. ఐ కమింగ్‌.’ అని చెప్పేసి సరాసరి ప్రధానిని కలుసుకొని పనులు చక్కబెట్టుకొని వచ్చేవారు. వాజపేయి– అడ్వాణీకీ మోదీ–అమిత్‌షాకీ చాలా వ్యత్యాసం ఉంది. మోదీ, అమిత్‌షాలు వీధి పోరాటాలకు సైతం వెనుకాడని రాజకీయ యోధులు. వారికి లక్ష్య సాధనే ప్రధానం కానీ మార్గం ముఖ్యం కాదు. అటువంటి జోడీని ఢీకొనే సాహసం చంద్రబాబు చేస్తారా? ఈ విషయంలో ఆయనకు సైతం స్పష్టత లేదు. ఇటీవలి వరకూ వెంకయ్యనాయుడు మధ్యవర్తిగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాలపైన వేసుకొని పరిష్కరించే వారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మంత్రుల ఇళ్ళ చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేరు. ఢిల్లీలో మీడియానూ, ఇతర ప్రము ఖులనూ ‘మేనేజ్‌’ చేయగల మనుషులు ఉన్నారు కానీ మోదీని సుముఖం చేసు కోగల శక్తి ఎవరికున్నది?

కాపులను బీసీలలో చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానించింది. బోయలను ఆదివాసీలుగా పరిగణించాలని కూడా శాసనసభ తీర్మానించింది. ఈ రెండు తీర్మానాలూ కేంద్రానికి పంపుతారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చమని అడుగు తారు (తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినంత మాత్రాన రక్షణ ఏమీ ఉండదు. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవచ్చు). రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇప్పించడానికి వీలు కల్పించాలని కోరుతారు. వీలు కల్పించ కపోతే కేంద్రం తప్పు అవుతుంది.  శాసనసభ తీర్మానం చేసింది కనుక తన బాధ్యత తీరిపోయిందని  తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికీ, కాపులకూ, బోయలకూ రిజర్వేషన్లు రాకపోవడానికీ ఎన్‌డీఏ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని వాదించవచ్చు. ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు కానీ యుద్ధం ప్రకటించ డానికి మాత్రం సంకోచిస్తున్నారు. ఎందుకు? ఓటుకు కోట్లు కేసు మాత్రమే కాకుండా చంద్రబాబు గుట్టుమట్టులన్నీ మోదీకి తెలుసుననీ, అందుకే ఆయనంటే భయపడుతున్నారనీ తెలుగుదేశం నాయకులే అంటున్నారు.

పోలవరం చాలా ఆవేశపూరితమైన అంశం. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వం 2014 ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. ముఖ్య మంత్రి ఆ విషయంలో అనూహ్యంగా రాజీపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజె క్టుగా పరిగణించాలని కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలోనే నిర్ణయించారు. అది చట్టం కూడా అయింది. అనంతరం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని యూపీఏ మంత్రిమండలి తీర్మానించింది. ఈ హామీని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు కేంద్రం నిర్వహిస్తే ఎంత ఖర్చు అయినా కేంద్రమే భరించవలసి వచ్చేది. ప్రాజెక్టు నిర్మించిన ఘనత బీజేపీకి దక్కకుండా తనకే పేరు రావాలన్న తాపత్రయంతో, తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్ల చేత పనులు చేయించి లబ్ధిపొందవచ్చునన్న ఆలోచనతో చంద్రబాబు స్వయంగా ఆ భారం నెత్తికెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థన మేరకు ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడమే మంచిదంటూ నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సును ఆమోదించినప్పుడే మోదీ సర్కారు ఒక షరతు విధించింది. ప్రాజెక్టు వ్యయం 2014 ఏప్రిల్‌ ఒకటి ధరల ప్రకారం ఎంత ఉంటుందో అంతే చెల్లిస్తాము కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వజాలమని స్పష్టంగా చెప్పింది. ధరలు పెరిగా యనీ, అంచనాలూ పెరుగుతాయనీ, 2014 నాటి అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామంటే నిర్మాణం అసాధ్యమనీ చెప్పి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటే ఈ తిప్పలు ఉండేవి కావు. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును ఇటీవల  జాతికి అంకితం చేసినట్టే పోలవరం ప్రాజెక్టును సైతం ప్రధాని ప్రారంభించేవారు. ఆ విధంగా జరగకపోవడానికి కారకులు ఎవరో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి.


- కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top