నిగ్గు తేలని నిజం

Mecca Masjid Bomb Blast Is A Mystery - Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ళ కేసులో అయిదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం దర్యాప్తు సంస్థల నిర్వాకానికి తాజా నిద ర్శనం. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ప్రార్థన సమయంలో హైదరాబాద్‌ పాత బస్తీలోని మక్కామసీదులో సెల్‌ఫోన్‌ ద్వారా బాంబులు పేల్చడం వల్ల తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాంబు పేలుళ్ళ తర్వాత మసీదు వెలుపల కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్ళు రువ్విన కారణంగా పోలీసులు జరిపిన కాల్పులలో అయిదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంతకాలం న్యాయం కోసం వేచి చూసి తీర్పు వివరాలు తెలు సుకొని నిరాశ చెందారు.

రాష్ట్ర పోలీసుల దర్యాప్తు క్రమంలో సుమారు రెండు వందలమంది అనుమా నితులను ప్రశ్నించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ప్రథమంగా బిలాల్‌ అనే ఉగ్రవాదిని పేలుళ్ళకు సూత్రధారిగా అనుమానించారు. పాకిస్తాన్‌లో స్థావరం కలిగిన ఉగ్రవాద సంస్థ హర్కత్‌–ఉల్‌–జిహాద్‌–ఇ–ఇస్లామీ (హెచ్‌యూజేఐ)లో బిలాల్‌ సభ్యుడని దర్యాప్తు అధికారులు భావించారు. కానీ అనుమానాన్ని ధ్రువీక రించడానికి తగిన ఆధారాలు లభించలేదు. న్యాయస్థానం బిలాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అద నపు సమాచారం అందింది. 2006–07లో మక్కామసీదుతో పాటు మరో మూడు ప్రాంతాలలో సెల్‌ఫోన్‌ ద్వారా జరిపిన పేలుళ్ళు సంభవించాయి. మహారాష్ట్రలోని మాలేగాంలో 2006లో పేలుళ్ళు జరిగాయి.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లోనూ, అజ్మీర్‌ దర్గాలోనూ 2007లో అదే ఫక్కీలో బాంబులు పేలాయి. ఈ ఘాతుకాల వెనుక ఒకే సంస్థ ఉన్నదనే అభిప్రాయానికి వచ్చిన సీబీఐ ఆ దిశగా దర్యాప్తు కొనసాగించింది. ‘అభినవ్‌ భారత్‌’ అనే హిందూ తీవ్రవాద సంస్థ ఈ నేరం చేసినట్టు గుర్తించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ దేవేందర్‌సింగ్, వ్యాపారి లోకేశ్‌ శర్మ, ఆయన గురువు సునీల్‌ జోషీలు మక్కామసీదు కాల్పుల వెనుక ఉన్నారని నిర్ధారించింది. ‘అభినవ్‌ భారత్‌’ మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూత్వవాదులు ఇండోర్‌ కేంద్రంగా నడుపుతున్న సంస్థ అని సీబీఐ అభిప్రాయం. దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం లేకుండానే అనూహ్యమైన పరిస్థితులలో సునీల్‌ జోషీని మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సీబీఐ మొత్తం 68 మంది సాక్షులను విచారించగా వారిలో 54 మంది ఎదురు తిరిగారు. ఈ దశలో నాలుగు పేలుళ్ళ కేసుల దర్యాప్తు బాధ్య తను సీబీఐ నుంచి ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ–జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించారు.

ఈ సంస్థ చేసిన దర్యాప్తులో అసీమానంద అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త, గుజరాత్‌ ఆశ్రమ నివాసి ప్రధాన నిందితుడని తేలింది. ఆయనతో పాటు మరి పదిమందిపై అభియోగాలు చేశారు. 2017 మార్చిలో దేవేందర్‌ గుప్తాను అజ్మీర్‌ దర్గా పేలుళ్ళ కేసులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అసీమానందను నిర్దోషిగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. కానీ మక్కామసీదు కేసులో మాత్రం ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అయిదుగురిని మాత్రమే విచారించి మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.

వారిపైన ఎన్‌ఐఏ చేసిన అభియోగా లను నిరూపించేందుకు తగిన ఆధారాలను ప్రాసిక్యూషన్‌ చూపించలేకపోయిం దని భావించిన 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె. దేవేందర్‌రెడ్డి అయిదు గురినీ నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుడైన దేవేందర్‌ గుప్తా సిమ్‌ కొన్నట్టు కానీ, మరో నిందితుడు రాజేందర్‌ చౌదరి బాంబు పేల్చినట్టు కానీ రుజువులు లేవని జడ్జి నిర్ణయించారు. ఇంతటి కీలకమైన కేసులో తీర్పు చెప్పిన వెంటనే రాజీనామా లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌కు పంపించి జడ్జి రవీందర్‌రెడ్డి సంచలనం కలిగించారు. రాజీనామాకు దారితీసిన కారణాలపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జడ్జిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 

ఎన్‌ఐఏ సారథ్యంలోనైనా దర్యాప్తు వేగం, సామర్థ్యం పెంచి దోషులను పట్టు కొని, తగిన ఆధారాలు సేకరించి, శిక్ష పడేవిధంగా ప్రాసిక్యూషన్‌ వాదించి ఉంటే దర్యాప్తు సంస్థ మోపిన అభియోగాలు నిజమని నిర్ధారణ జరిగేది. సీబీఐ కానీ ఎన్‌ఐఏ కానీ నిందితులపైన పెట్టిన కేసులలో వీగిపోయినవే అత్యధికం. ఎన్‌ఐఏ డైరెక్టర్‌గా శరద్‌ కుమార్‌ సేవలను పొడిగించడం ఒక వివాదాస్పదమైన అంశం. అసీమానం దకు బెయిల్‌ ఇవ్వడంపై హైకోర్టులో అప్పీలు చేయాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎన్‌ఐఏ అధికారులు కేంద్ర కార్యాలయానికి సిఫార్సు చేసినప్పటికే ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ళ కేసులో అసీమానందకు బెయిల్‌ మంజూరైనప్పుడు కూడా ఎన్‌ఐఏ పైకోర్టులో అప్పీలు చేయలేదు. ఈ కేసులో ఇంద్రేశ్‌  కుమార్, ప్రజ్ఞాఠాకూర్‌ వంటి చాలామంది ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు మిన హాయింపు మంజూరు చేశారు. అసీమానంద స్వయంగా మక్కామసీదు పేలుళ్ళను ఎట్లా జరిపారో వివరంగా న్యాయస్థానంలోనూ, మీడియా ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అసీమానందను నిర్దోషిగా కోర్టు నిర్ణయించడం విశేషం. 2010 డిసెంబర్‌ 8న అసీమానంద కోర్టులో మేజిస్ట్రేట్‌ ఎదుట నేరం అంగీకరించారు. ‘నాకు మరణదండన విధించే అవకాశం ఉన్నదని నాకు తెలుసు. అయినా సరే నేరం అంగీకరిస్తూ ప్రకటన చేయదలిచాను’ అంటూ మాట్లాడారు.

పోలీసు కస్టడీలో తీసుకున్న నేరాంగీకార వాంగ్మూలం చెల్లనేరదని జడ్జి రవీందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ కేసులో తీర్పుపైన బీజేపీ ఆనందం వెలిబుచ్చింది.  కర్ణాటక ఎన్నికల ముందు ఇటువంటి తీర్పు రావడం రాజకీయంగా బీజేపీకి సాను కూలమైన పరిణామం. దేశంలో దర్యాప్తు సంస్థలు ఏ స్థాయిలో ఉన్నా ఏ పేరుమీద ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు లేవనే వాస్తవాన్ని చాలాకాలం క్రితమే ప్రజలు అర్థం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థ సైతం అంత నిజాయితీగా, నిర్భయంగా విధ్యుక్తధర్మం నెరవేర్చడం లేదనడానికి హైదరాబాద్‌లో ఒకే ఒక నెలలో అవినీతి ఆరో పణలపైన ముగ్గురు జడ్జీలు అరెస్టు కావడం నిదర్శనం. పదకొండు సంవత్సరాల పాటు దర్యాప్తూ, విచారణా జరిగినప్పటికీ మక్కామసీదులో ఆనాడు పేలుళ్ళు జరిపిన వ్యక్తులు ఎవ్వరనే శేషప్రశ్న జాతిని వెక్కిరిస్తూనే, వేధిస్తూనే ఉంటుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top