
మార్కెట్ చైర్మనా... మాకొద్దుబాబోయ్..!!
అధికార పార్టీ నాయకులు ఎన్నోరోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న కోదాడ మార్కెట్ చైర్మన్ పదవికి ఇపుడు సెంటిమెంట్దెబ్బ తగులుతోంది
–సెంటిమెంట్తో భయపడుతున్న నాయకులు
–పదవి తీసుకున్న వారి ఎదుగుదల ఆగిపోతుందని భయం
–నాటి నుంచి నేటి వరకు అంతే
కోదాడ: అధికార పార్టీ నాయకులు ఎన్నోరోజులుగా ఆశగా ఎదురు చూస్తున్న కోదాడ మార్కెట్ చైర్మన్ పదవికి ఇపుడు సెంటిమెంట్దెబ్బ తగులుతోంది. ఇప్పటి వరకు ఈ పదవిపై ఆశ పెట్టుకున్న వారు సెంటిమెంట్ దెబ్బకు కాస్తా వెనుక, ముందూ ఆలోచిస్తున్నారు. దీంతో ఈ పదవి కోసం రాష్ట్ర నేతల వద్దకు వెల్లడం కూడ మానేశారు. వారు పిలిచి ఇచ్చినపుడు చూద్దాంలే అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే మార్కెట్ పాలకవర్గం పట్టించుకోకపోవడానికి కారణమని భావిస్తున్నప్పటికి తాజాగా దీనికి నాయకుల సెంటిమెంట్ కూడ తోడవ్వడంతో నేతలు మార్కెట్ చైర్మన్ పదవిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం
ఇంతకీ ఏమిటా సెంటిమెంట్..
వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నేతల రాజకీయ భవష్యత్తు అంతటితోనే ఆగిపోవడం. అలాగే వారు నియోజకవర్గ స్థాయి పదవిని కూడ పొందలేక పోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరిది అదే పరిస్థితి కావడంతో నిజమే కాబోలు అనుకునే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలందరిది ఇదే పరిస్థితి. కోదాడ మార్కెట్కు తొలి చైర్మన్గా కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన ముండ్రా నాగేశ్వరరావు వ్యవహరించారు. ఆయన ఆ పదవితోనే సరిపెట్టుకున్నారు తరువాత ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. ఇక ఆయన తరువాత చైర్మన్లుగా వ్యవహరించిన ఏర్నేనిబాబు, జెట్టి వెంకటరెడ్డి, చల్లా రామ్మూర్తి, ఎండీ మహబూబ్ జానీ, పయిడిమర్రి సత్యబాబు ఇలా అందరు నియోజకవర్గం దాటి రాజకీయంగా ఎదిగింది లేదు. బయటకు వెల్లింది లేదు
ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుల తరుణం
తాజాగా టీఆర్ఎస్ నాయకులను ఈ పదవి ఒక పక్క ఊరిస్తుండగా మరో పక్క తీసుకుంటే వారి పరిస్థితి కూడ ఇదే విధంగా మారుతుందేమోననే సంకోచం నేతలకు ఎక్కడో కలుక్కుమనిపిస్తుంది. మరి కొందరు మాత్రం సెంటిమెంట్ లేదు ఆయింట్మెంట్ లేదు.. పదవి తీసుకుంటే నియోజకవర్గంలో చక్రం తిప్పడంతో పాటు రానున్న ఎన్నికల సమయానికి టికెట్ సాధించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ పదవి ఎవ్వరిని వరిస్తుందో.. వారికి సెంట్మెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే మరి. స్థానిక నేతలు ఇలా ఆలోచిస్తుండగా పానకంలో పుడకలాగా కోదాడకు చెందిన ఒక ఎన్ఆర్ఐ తనకు మార్కెట్ చైర్మన్ పదవి కావాలని రాష్ట్ర నాయకత్వానికి అమెరికా నుంచి విజ్ఞాపనల మీద విజ్ఞాపనలు పంపడం, వాటి కాపీలను స్థానిక మీడియాకు పంపించి కొద్ది రోజుల్లోనే తనకు చైర్మన్ పదవి వస్తుందని, రాష్ట్ర నాయకత్వం తనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.