అక్రమాలను ‘యాప్’దాం ఇలా..
నిడమర్రు : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సాంకేతిక బాట పట్టారు. క్షేత్రస్థాయి లోపాలను సవరించేందుకు అధికారులు ‘ఏపీ ఎండీఎం అటెండెన్స్’ పేరుతో ఓ యాప్ను రూపొందించారు.
నిడమర్రు : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సాంకేతిక బాట పట్టారు. క్షేత్రస్థాయి లోపాలను సవరించేందుకు అధికారులు ‘ఏపీ ఎండీఎం అటెండెన్స్’ పేరుతో ఓ యాప్ను రూపొందించారు. దీంతోపాటు పాఠశాలకు ఆయా నెలల్లో కేటాయించిన మొత్తం బియ్యం సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఓ వెబ్పోర్టల్ను ఒక యాప్కు అనుసంధానించి అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆ వివరాలు మీకోసం..
ఎస్ఎంఎస్ బదులు యాప్లో..
ఇప్పటి వరుకూ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విద్యార్థుల హాజరు వివరాలను హెచ్ఎంలు మొబైల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో ఉన్నతాధికారులకు పంపేవారు. ఈ ఎస్ఎంఎస్ నేరుగా రాష్ట్రస్థాయి అధికారులకు చేరేలా ఏర్పాటు చేశారు. ఈ విధానంలో సంబంధిత పాఠశాల హెచ్ఎం మొబైల్ నంబర్ మాత్రమే రాష్ట్రస్థాయి అధికారులవద్ద నమోదై ఉండేది. దీంతో ప్రతిరోజూ తప్పనిసరిగా హెచ్ఎం మొబైల్ నంబర్తో మాత్రమే ఉదయం 11 గటంలలోపు ఎస్ఎంఎస్ పంచాల్సి రావడంతో హెచ్ఎం సెలవు లేదా ఏదైనా నెట్వర్క్ అందని ప్రాంతంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడేవారు. అలాగని ఎస్ఎంఎస్ పంపకుంటే బిల్లుల చెల్లింపు నిలిచిపోయేది. దీనివల్ల మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఇబ్బంది పడేవి. ఈ లోపాన్ని అధికమించేందుకే యాప్ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ సాయంతో ప్రతిరోజూ మధ్యాహ్నం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, మధ్యాహ్న భోజనం చేసిన వారి సమాచారం క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అవకతవకలకూ చెక్
–ఈ యాప్ వినియోగంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరుకూ ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు.
గతంలో నెలవారీ నివేదికలు ఆధారంగా ఏజెన్సీలకు బిల్లులు చెల్లింపులు జరిగేవి. దీంతో అనేక పాఠశాలల్లో హాజరు శాతం ఎంత ఉంటే అంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసినట్లు చూపించేవారు. నెలకు ఒకసారి రిపోర్ట్ చేయాల్సి రావడంతో రోజువారీ సంఖ్యను మార్పు చేసి ఏజెన్సీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుండేది. ఈ విషయం పలు సర్వేల్లో బహిర్గతం కావడంతో అధికారులు ఏ రోజు నివేదికను ఆరోజు ఎస్ఎంఎస్ ద్వారా పంపేలా చర్యలు తీసుకున్నారు. ఈ విధానంతోపాటు కొత్తగా రూపొందించిన యాప్ వల్ల మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా అమలు చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
యాప్ వినియోగం ఇలా..
– స్మార్ట్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీ ఎండీఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
– అందులో మధ్యాహ్న భోజన పథకం అని తెలుగులో ముఖ చిత్రం కనబడుతుంది.
–ఎండీఎం యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాక స్క్రీన్పై మొదటి కాలంలో పాఠశాల యు– డైస్ కోడ్ నమోదు చేయాలి.
– రెండో కాలంలో పాస్వర్డ్ అని ఉంటుంది. అక్కడ రాష్ట్రంలోని ఏ పాఠశాల వారైనా 123 పాస్వర్డ్తో లాగిన్ అవ్వవచ్చు.
– లాగిన్ అయిన అనంతరం ఆ స్క్రీన్పై మీ పాఠశాల పేరుతోపాటు తరగతి, విద్యార్థుల హాజరు, ఆరోజు భోజనం చేసిన వారి సంఖ్య వివరాలు నమోదు చేయాలి.
– దీంతో ఆరోజు పాఠశాలలో జరిగిన మధ్యాహ్న భోజన వివరాలు రాష్ట్రస్థాయి అధికారులకు క్షణాల్లో చేరిపోతాయి.
– వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక్కసారి ఎంటర్ బటన్ నొక్కిన తర్వాత వివరాలు మార్చుకునేందుకు ఏ మాత్రం వీలుండదని ఉపాధ్యాయులు గమనించాలి. యాప్లో నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వివరాలు సరిచూసుకోవాలి.
బియ్యం కేటాయింపు తెలుసుకోండిలా..
మధ్యాహ్న భోజనానికి ఏఏ పాఠశాలకు ఏ నెల ఎంత మొత్తం బియ్యం కేటాయించారో హెచ్ఎంలు తెలుసుకునేందుకూ ఓ వెబ్పోర్టల్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ‘ఎస్సీఎం ఎఫ్పీఎస్ స్టేటస్’ దీనిని రూపొందించారు. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి నమోదు చేసుకున్నాక. స్క్రీన్పైన ఉన్న కాలంలో జిల్లా, మండలం, రేషన్ షాపు నంబర్ నమోదు చేసి ఏ నెలలో ఎంత బియ్యం కేటాయించారో అన్న విషయం సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు సులువుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల పౌరసరఫరా శాఖ ద్వారా జరిగే అక్రమాలను నిరోధించేందుకు వీలవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. యాప్, వెబ్పోర్టల్ను వినియోగించాలంటే ఇకపై హెచ్ఎంలకు స్మార్ట్ఫోన్ తప్పనిసరి మరి.