సంక్షోభంలో సంక్షేమ వారధులు | problems of anganwadi workers | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో సంక్షేమ వారధులు

Dec 31 2016 10:52 PM | Updated on Aug 20 2018 4:17 PM

సంక్షోభంలో సంక్షేమ వారధులు - Sakshi

సంక్షోభంలో సంక్షేమ వారధులు

సర్కారు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే వారధులైన అంగన్ వాడీ కార్యకర్తలు అప్పుల క్షోభతో కాలం వెల్లదీస్తున్నారు.

అప్పుచేసి పెడుతున్న అంగన్ వాడీలు
జిల్లా వ్యాప్తంగా నిలిచిన భోజన, అద్దెబిల్లులు
ప్రభుత్వం పట్టింపులేమి.. అధికారుల  అలసత్వమే కారణం


సిరిసిల్ల టౌన్‌/గంభీరావుపేట: సర్కారు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే వారధులైన అంగన్ వాడీ కార్యకర్తలు అప్పుల క్షోభతో కాలం వెల్లదీస్తున్నారు. ఆరు నెలల తరబడిగా ప్రభుత్వ బిల్లులు నిలిచిపోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం, భవనాల అద్దె చెల్లింపులు రాకపోవడం వారిని అప్పులపాలు చేస్తుంది. ఉన్నతాధికారులకు విన్నవించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆరోగ్యలక్షి్మకి సంబంధించిన బిల్లులు ఇవ్వక పోవడంతో ఒక్కొక్కరు రూ.లక్ష వరకు అప్పులు చేసి సెంటర్లను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్ వాడీ సెంటర్ల నిర్వాహకుల దయనీయ పరిస్థితిపై కథనం.

విధులు ఘనం..నిధుల్లో నిర్లక్ష్యం
అంగన్ వాడీలపై సర్కారు శీతకన్ను వహిస్తుం ది. మూడు సంవత్సరాలు మొదలు ఆరు సంవత్సరాలు వరకు ప్రీప్రైమరీ స్థాయిలో చిన్నారులకు విద్యను అందించడం,  గర్భిణీలు, బాలిం తలు, చిన్నారులకు పౌష్టికాహారం అందివ్వడం వీరి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకాన్ని ప్రజలకు అందించడానికి వీరి సేవలు తప్పనిసరి అయింది. జనగణన చేయడం, ఓటర్ల జాబితాలు తయారు చేయడంతో పాటు ప్రతీ సామాజిక అంశాల్లో వీరిని ప్రభుత్వం విధులు కేటాయిస్తున్నా, వారి శాఖాపరంగా అమలు చేస్తున్న పథకాలపై ఆరోగ్యలక్షి్మకి సంబంధించిన బిల్లు, సెంటర్‌ నిర్వహణపై ఆన్ లైన్  రిపోర్టు బిల్లు, నెలసరి ప్రాజెక్టు సమావేశాలకు సంబంధించిన టీఏ, డీఏ బిల్లు, సెంటర్ల నిర్వహణకు అద్దెభవనాల బిల్లులు మాత్రం ఇవ్వ డం లేదు. సుమారు ఆరునెలలుగా బిల్లులు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంటర్ల నిర్వాహకులు అప్పులు చేస్తూ వస్తున్నారు.

అంగన్ వాడీలకు తప్పని అప్పులభారం
జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ పరిధిలో 587 అంగన్ వాడీ సెంటర్లున్నాయి. వీటి నిర్వహణకు వేములవాడ  ఐసీడీఎస్‌ పరిధిలో 86, సిరిసిల్ల పరిధిలో 165 సెంటర్లకు ప్రభుత్వ పరంగా అద్దెలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు ఏడు నెలలుగా రూ.20లక్షలు, ఆరోగ్యలక్షి్మకి సంబంధించి నాలుగు నెలలు బిల్లు రూ.2.16 కోట్లు నిధులు రావాల్సి ఉంది.  టీఏ, డీఏ బిల్లులు నాలుగు సంవత్సరాలుగా రావడం లేదు. వీటి విలువ సుమారు రూ.90లక్షల వరకు ఉంటుం ది. వీటికి తోడుగా గత జనవరి మాసం నుంచి సెంటర్‌ నిర్వాహకులతో వారి పరిధిలో గల బాలింతలు, శిశువులు, గర్భిణీలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో పొందుపర చడానికి ప్రభుత్వం ఒక్కొక్కసెంటర్‌కు రూ.600 చొప్పున నిదులు కేటాయించగా వాటిని నిర్వాహకులకు అందించడంలో వేములవాడ, సిరిసిల్ల ఐసీడీఎస్‌ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా సుమారు రూ.3.53లక్షలు నిధులు మళ్లిపోయాయి. ఇవన్ని కలిపితే..మొత్తంగా 3కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లో ఉంటున్నాయి. పెద్దమొత్తంలో అప్పులు చేసిన వారు ప్రస్తుతం అప్పులబాధ నుంచి తప్పించాలని విన్నవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement