
సాదాబైనామా విచారణ షురూ!
ఇప్పటి వరకు విచారణ కోసం రైతులకు ఇచ్చిన నోటీసులు 1,06,284 సాదాబైనామా ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. రైతు ప్రయోజనాల నేపథ్యంలో వారి భూములను సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించిన విషయం తెల్సిందే.
- కబ్జా, పట్టాదారుడితోపాటు జీపీకి నోటీసులు
- ఎవరు ఆబ్జెక్షన్ చెప్పినా రిజిస్ట్రేషన్కు నో
- సాదాబైనామాకు 2,47,538 దరఖాస్తులు
- ఇప్పటివరకు 1,47,519 దరఖాస్తుల పరిశీలన
వీణవంక : ఇప్పటి వరకు విచారణ కోసం రైతులకు ఇచ్చిన నోటీసులు 1,06,284 సాదాబైనామా ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. రైతు ప్రయోజనాల నేపథ్యంలో వారి భూములను సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించిన విషయం తెల్సిందే. తెల్లకాగితాలపై (సాదాబానామా) రాయించుకున్న భూములకు (ఐదెకరాలలోపు) చట్టబద్దత కల్పిస్తూ.. ఉచితంగా పట్టాపాసు పుస్తకం ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు రికార్డుస్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,47,538 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1,47,519 దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. కరీంనగర్ డివిజన్లో అత్యధికంగా 1,10,894 దరఖాస్తులు రాగా.. తర్వాత స్థానంలో జగిత్యాల 51,685, పెద్దపల్లి 40,272, సిరిసిల్ల 25,436, అత్యల్పంగా మంథని నుంచి 19,249 వచ్చాయి. జిల్లాలోనే అత్యధికంగా జమ్మికుంట మండలంలో 12,540 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
మోకాపై విచారణ షురూ
సాదాబైనామాకు దరఖాస్తు చేసుకున్న కబ్జాదారుడిని విచారించేముందు అధికారులు గ్రామ పంచాయతీ, కబ్జాదారుడికి, పట్టాదారుడికి నోటీసులు అందిస్తున్నారు. ఫలానా సమయంలో భూముల వద్దకు వచ్చి విచారిస్తామని అందులో పేర్కొంటున్నారు. ఇలా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,06,284మందికి నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని మండలాల్లో ఇప్పటికే మోకాపైకి వెళ్తున్న అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య తీవ్రంగా ఉండడంతో నోటీసులు జారీ చేయడం ఇబ్బందిగా మారిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు ఇవ్వే..
– కబ్జాదారుడు, పట్టాదారుడు, గ్రామపంచాయతీకి నోటీసులు అందించిన అనంతరం మోకాపై విచారణ జరుపుతారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం జీపీలో మరో వాగ్మూలం తీసుకుంటారు. ఇందులో ఏ ఒక్కరు ఆబ్జెక్షన్ చెప్పినా ఉచిత రిజిస్ట్రేషన్ను అనుమతించారు.
– భూమి అమ్మిన తర్వాత పట్టాదారుడు ఒకవేళ చనిపోతే మోకాపై సాక్షులను విచారిస్తారు. అనంతరం కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకుంటారు. కుటుంబసభ్యులు అనుమతి ఇస్తేనే కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
– కుటుంబం కలుపుకుని (భార్య/భర్త/పిల్లలు)ఐదెకరాలలోపు ఉన్న వారికే సాదాబైనామా వర్తిస్తుంది. ఆపై ఉంటే పరిగణనలోకి తీసుకోరు. (ఈ విషయం తెలియక జిల్లాలో 6220మంది దరఖాస్తులు పెట్టుకున్నారు)
– వివాదాస్పద భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూముల సాదాబైనామా దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
– 2014 జూన్ 1కంటే ముందు భూమి కొనుగోలు చేసి కబ్జాలో ఉంటేనే సాదాబైనామా వర్తిస్తుంది. ఇవి అధికారులు మోకాపై వెళ్లినప్పుడు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు.
పరాదర్శకంగా వ్యవహరిస్తాం
– తహశీల్దార్ బావ్సింగ్
సాదాబైనామా విచారణలో పారదర్శకంగా వ్యవహరిస్తాం. కబ్జా, పట్టదారుడితోపాటు జీపీలో విచారించాకే ఉచిత రిజిస్ట్రేషన్కు అనుమతిని ఇస్తాం. ఇప్పటికే విచారణ కోసం నోటీసులు జారీ చేశాం. నోటీసుల ప్రకారం రైతులు విచారణ రోజు మోకాపై తప్పనిసరిగా ఉండాలి. కబ్జాదారుడికి ఐదెకరాల పైన ఉంటే సాదాబైనామా వర్తించదు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు.
డివిజన్లు దరఖాస్తులు రైతులకు నోటీసులు
జగిత్యాల 51685 23566
కరీంనగర్ 110894 21334
మంథని 19249 14201
పెద్దపల్లి 40272 32134
సిరిసిల్ల 25436 15049
మొత్తం దరఖాస్తులు 2,47,538