సూదాపాలెం బాధితులకు చెరో రూ.4 లక్షలు
సూదాపాలెం ఘటనలో బాధితులైన మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావులకు చెరో రూ.4 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తామని ఎస్సీ, ఎస్టీ చైర్మన్ కారెం శివాజీ ప్రకటించారు. ఆయన గురువారం అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం ఘటన బాధితులను పరామర్శించారు
-
ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ విచారణ
-
నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు
అమలాపురం టౌన్ :
సూదాపాలెం ఘటనలో బాధితులైన మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావులకు చెరో రూ.4 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తామని ఎస్సీ, ఎస్టీ చైర్మన్ కారెం శివాజీ ప్రకటించారు. ఆయన గురువారం అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూదాపాలెం ఘటన బాధితులను పరామర్శించారు. మీకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఘటనపై పలువురు దళిత నాయకులు, ప్రత్యక్ష సాక్షులతో ఆర్డీఓ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ హోదాలో శివాజీ విచారణ నిర్వహించారు. ఈ విచారణలో ఆర్డీఓ జి.గణేష్కుమార్, డీఎస్పీ లంక అంకయ్య పాల్గొన్నారు. ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనప్పటికీ ఓ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని శివాజీ స్పష్టం చేశారు. దాడి చేసిన వారు బాధిత దళితులపై కౌంటర్ కేసులు పెడితే పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన డీఎస్పీ అంకయ్యకు సూచించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులకు బెయిల్ కూడా రాకుండా చేయడంలో కూడా తప్పు లేదన్నారు. ఘటనలో స్వల్పంగా గాయపడ్డ వ్యాన్ డ్రైవన్ సవరపు లక్ష్మణకుమార్కు కమిషన్ తరపున రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఎలీషా, వెంకటేశ్వరరావులకు ఇవ్వబోయే చెరో రూ.4 లక్షల్లో 25 శాతం తక్షణమే అందిస్తారని చెప్పారు. 50 శాతం నిధులు కేసు ఛార్జిషీటు వేసినప్పుడు, మిగిలిన 25 శాతం కేసు కోర్టులో తుది విచారణ సమయంలో ఇస్తారని శివాజీ తెలిపారు. దండోరా నాయకుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఘటన జరిగినప్పుడు దళితులు తీవ్రమైన రక్తపు గాయాలతో ఉంటే వారిని పోలీసులు గొడ్లను తీసుకు వెళ్లినట్టు వ్యాన్లో పడేసి తీసుకుని వెళ్లారని ఆరోపించారు. వారిని ముందు ఆస్పత్రికి కాకుండా పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లారని, దాంతో వారికి వైద్యం అందడంలో జాప్యానికి పోలీసులు కారణమయ్యారని తెలిపారు. కోనసీమ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మోకాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోనసీమలో పోలీసులు నమోదు చేస్తున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వీగిపోతున్నాయని ఆరోపించారు. సూదాపాలెం ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని శివాజీకి సూచించారు.