
'ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను'
ప్రస్తుతానికి రాజకీయాలలోకి రావాలని లేదని, దానికి ఇంకా సమయముందని సినీ హాస్యనటుడు ఆలీ చెప్పారు.
నూజివీడు : ప్రస్తుతానికి రాజకీయాలలోకి రావాలని లేదని, దానికి ఇంకా సమయముందని సినీ హాస్యనటుడు ఆలీ చెప్పారు. అయినా గతంలో పార్టీలుండేవని, నేడు వర్గాలుగా మారాయని అన్నారు. నూజివీడులో నిర్వహిస్తున్న అఖిలభారత కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడకు విచ్చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 35 ఏళ్ల సినీ జీవితంలో నేను నటించిన సినిమాలలో రెండు సినిమాలు ఎంతో ఇష్టం, అవి ఒకటి హీరోగా చేసిన యమలీల, రెండోది కమేడియన్గా చేసిన రాజేంద్రుడు-గజేంద్రుడు అని తెలిపారు.
ఏ వ్యక్తి అయినా తాను నమ్ముకున్న వృత్తిపై శ్రద్ధపెట్టి కష్టపడి పనిచేస్తే ఆ వృత్తిలో పైస్థాయికి వెళ్లడం ఖచ్ఛితంగా జరుగుతుందన్నారు. సీతాకోకచిలుక సినిమాలో తాను నటించినప్పుడు రూ.2500 పారితోషికం ఇచ్చారని, దానికి అవార్డు రాగా, అవార్డు కింద మాత్రం రూ.5వేలు ఇవ్వడం అప్పట్లో తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా మార్చిలో భర్త చనిపోయిన మహిళలకు, టైలర్స్కు ఆర్థిక సాయం చేస్తున్నానన్నారు.
వృద్ధ మహిళలకు పింఛన్ అందజేస్తున్నానన్నారు. రాజమండ్రిలో వాటర్ప్లాంటు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నానన్నారు. సెన్సార్ నిబంధనలు వర్తిస్తే ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతున్న షోలు నిలిపివేసి భక్తి కార్యక్రమాలను ప్రసారం చేసుకోవాల్సి వస్తుందన్నారు. రేటింగ్ కోసం చానళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉందన్నారు. సమాజంలో ఎవరినీ దూరం చేసుకోవద్దు...అని చెప్పిన మా నాన్న మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయని అన్నారు.