అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Young Man Suspicious Death in Hyderabad - Sakshi

మృతుడి ఒంటిపై పలుచోట్ల గాయాలు

ఆత్మహత్యగా అనుమానాలు

పుప్పాలగూడ ప్రాంతంలో ఘటన

రాజేంద్రనగర్‌: అనుమానస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన కుమార్‌కు ఇద్దరు తనయులు జూపల్లి తరుణ్‌ (19). తరుణ్‌ పదో తరగతి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే జులాయిగా తిరుగుతూ పలు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పలుమార్లు మందలించినా వినలేదు. అయితే తరుణ్‌ మాత్రం ఇంటిపై ఉన్న టెర్రస్‌లోని రూమ్‌లో ఉంటున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి 11.40 నిమిషాల ప్రాంతంలో తరుణ్‌ తన తల్లికి ఫోన్‌చేసి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని చెప్పాడు. అనంతరం అదే రాత్రి 1.20 గంటల ప్రాంతంలో పార్టీ ఆలస్యమవుతుందని తెల్లవారుజామున ఇంటికొస్తానని తెలిపాడు. అయితే మరుసటి రోజు ఉదయం 7 గంటలైనా కుమారుడు రాకపోవడంతో తల్లి తరుణ్‌కు ఫోన్‌ చేసింది.

ఎలాంటి స్పందన లేకపోగా కొద్ది సమయానికే స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో తల్లితో పాటు కుటుంబసభ్యులు, సోదరుడు రామ్‌కుమార్‌ స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తరుణ్‌ కోసం వెతికారు. సాయంత్రం టెర్రస్‌పై ఉన్న రూమ్‌లో వెళ్లిచూడగా తరుణ్‌ సృహ తప్పి పడి ఉన్నాడు. తల, ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండడంతో కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల, ముక్కు, చేతులు, వీపుపై గాయాలు ఉన్నాయి. రూమ్‌లో ఉరివేసుకున్న ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదుచేశారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే మృతుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయని తెలుస్తోంది. తరుణ్‌ ఈ విషయమై ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం విచారణలో తేలనుంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top