బావ చావుకొస్తే.. అల్లుడు కత్తితో దాడి

son in law attack to his uncle - Sakshi

నెల్లూరు, నాయుడుపేటటౌన్‌(సూళ్లూరుపేట) : బావ మృత్యువాత పడితే చూసేందుకు వచ్చిన.. బావమరిదిపై అతని అల్లుడు, బంధువులు కత్తులతో దాడిచేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జువ్వలపాళెం గ్రామానికి చెందిన బత్తెయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మృతుడి బావమరిది గోవా మాధవయ్య బత్తెయ్య మృతదేహాన్ని చూసేందుకు వచ్చాడు. పూలమాలలు వేసి తిరిగి వస్తున్న క్రమంలో మృతుడి కుమారుడు మొద్దు సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంతమంది మాధవయ్యను అడ్డుకుని, మా ఇంటికి ఎందుకు వచ్చావంటూ పాత కక్షల నేపథ్యంలో గొడవకు దిగారు.

దీంతో గొడవ ఒక్కసారిగా పెద్దది కావడంతో కోపోద్రిక్తుడైన సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి వచ్చిన కర్ణాటి మునిరాజా, మునిప్రసాద్, మొద్దు సుందరయ్యతో పాటు స్థానికంగా ఉన్న మరికొంతమంది కత్తులతో మాధవయ్యపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన మాధవయ్యను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. పాత కక్షల కారణంగా తనపై కత్తులతో దాడిచేసి, చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top