తండ్రిని హతమార్చిన తనయుడు!

Son Killed Her Father Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన బుధవారం మండలంలోని ఏటుకూరులో జరిగింది. క్షణికావేశంతో చేసిన దాడిలో ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ద్రాక్షారామం అంజయ్య(67) వ్యవసాయం చేస్తూ కొడుకు శివనాగేంద్రరావు వద్ద జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద సేదతీరుతున్న అంజయ్యకు  కోడలకు మధ్య వివాదం ఏర్పడింది.

ఈ క్రమంలో అంజయ్య కోపంతో ఇంటిలోని సామాన్లు పగలగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో కోడలు తన భర్త శివనాగేంద్రరావుకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అప్పటికే గ్రామ కూడలిలో ఉన్న శివనాగేంద్రరరావు ఆగ్రహంతో ఇంటికి వచ్చాడు. తండ్రిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆవేశంతో అంజయ్య ఇంట్లో ఉన్న గడ్డపలుగుతో కొడుకుపైకి దాడికి దిగాడు. ఈ క్రమంలో తనపై దాడి చేస్తున్న తండ్రి చేతిలోని గడ్డపలుగును లాక్కుని అతని తలపై బలంగా మోదాడు. అంతే ఒక్కసారిగా అంజయ్య కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న మండల నల్లపాడు సీఐ వీరాస్వామి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top