దొంగగా మారిన రైల్వే కూలీ

Robber Arrested By Police In Nellore - Sakshi

మూడేళ్లుగా చోరీలు

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న వైనం  

ఎట్టకేలకు చిక్కిన ఘరానా దొంగ

రూ.18.50 లక్షల సొత్తు స్వాధీనం  

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): అతను రైల్వే కూలీగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైయ్యాడు. తాళం వేసిన దుకాణాలు, ఇళ్లలో చోరీలు చేసి అందినకాడికి దోచుకెళ్లసాగాడు. మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఘరానా దొంగను నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.18.50 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. వెంకటాచలం మండలం పలుకూరివారిపాళేనికి చెందిన శివనారాయణ అలియాస్‌ శివ నెల్లూరు నగరంలో రైల్వే కూలీగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన నిందితుడు చోరీల బాటపట్టాడు. మూడేళ్లుగా నెల్లూరు నగరంలోని పలుచోట్ల కుదువ షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఫైనాన్స్‌ సంస్థ, మొబైల్‌ షోరూంలలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు.

శివ ఈ ఏడాది జూలై 25వ తేదీ రాత్రి వేదాయపాళెంలోని లాట్‌ మొబైల్‌షాపులో గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించి 15 సెల్‌ఫోన్లు, 21 బ్లూటూత్‌లు, మెమొరీ కార్డులు, క్యాష్‌ కౌంటర్లోని కొంత నగదును అపహరించాడు. ఈ ఘటనపై వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం శివ, నెల్లూరు శిల్పారామం సమీపంలోని కంపచెట్ల వద్ద ఉన్నాడనే పక్కా సమాచారం వేదాయపాళెం పోలీసులకు అందింది. ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నా రు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచా రించగా లాట్‌ మొబైల్‌ షోరూంతోటు అనేకచోట్ల చోరీలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు. 

2016 నుంచి నేరాలు 
నిందితుడు శివ 2016 సంవత్సరం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్ప డుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. 2016 మే 11వ తేదీన సంతపేటలోని నాలుగుకాళ్ల మంటపం సమీపంలో ఓ కుదువ షాపులో 280 గ్రాముల బంగారం, 2018 సంవత్సరం మే 18వ తేదీన అదే ప్రాంతంలోని మరో కుదువ అంగడిలో ఎనిమిది కేజీల వెండి ఆభరణాలు, 16 గ్రాముల బంగారం, గతనెలలో బోసుబొమ్మ సమీపంలోని ఓ షాపులో వస్తువులు, ఆటోనగర్‌లో ఇన్నోవా కారును దొంగిలించాడని డీఎస్పీ వెల్లడించారు. అతని నుంచి రూ.18.50 లక్షలు విలువచేసే 12 సవర్ల బంగారు ఆభరణాలు, 11 కేజీల వెండి కాళ్ల గొలుసులు, 14 సెల్‌ఫోన్లు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. 

సిబ్బందికి అభినందన 
నిందితుడిని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన వేదయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్సైలు కె.లక్ష్మణ్‌రావు, ఎం.పుల్లారెడ్డి, క్రైమ్‌ పార్టీ సిబ్బంది ప్రసాద్, సుధాకర్, గోపాలయ్య, జిలానీ తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top