అనుమానాస్పద స్థితిలో ఆశ్రమ బాలిక మృతి

a girl suspicious death in ashram school in orissa - Sakshi

సిరిపూర్‌ గ్రామంలో ఘటన

డేప్పుగుడలో విషాదం

రాయగడ : రాయగడ జిల్లా కల్యాణసింగుపురం సమితి నారాయణపూర్‌ పంచాయతీ పరిధిలోని సిరిపూర్‌ గ్రామంలో ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక్కడ 8వ తరగతి చదువుతున్న కబిత హీకాక(13) అనే విద్యార్థిని గత నెల 31వ తేదీన మేడపై మృతి చెంది కనిపించింది. తోటి విద్యార్థినులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. డేప్పుగుడ గ్రామానికి చెందిన కబిత హీకాక సిరిపూర్‌ గ్రామంలో ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత నెల 31వ తేదీన సాయంత్రం ఈ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ మేడపై బట్టులు ఆరేవేసేందుకు కబిత హీకాక వెళ్లింది. అయితే ఎంతసేపటికి ఆమె రాకపోవడంతో తోటి విద్యార్థిని మేడపైకి వెళ్లి చూడగా కబిత హీకాక శరీరంపై తీవ్ర గాయాలై కిందపడి ఉంది. వెంటనే ఆ బాలిక విషయాన్ని హాస్టల్‌ సిబ్బందికి తెలిపింది.

వెంటనే హాస్టల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎం కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్టు డాక్టర్‌ నిర్ధారించారు. ఈ విషయం డేప్పగుడలో బాలిక తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది తెలియజేశారు. వారు వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు మృతి కాదని ఆవేదన చెందారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం చేసేందుకు గురువారం నిర్ణయించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే రాయగడ ఐటీడీఏ పీఓ మురళిధర్‌స్వొయి, డీడబ్ల్యూఓ పాత్రో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీసులు, జాగిలాలతో విచారణ జరిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top