యువజంట అనుమానాస్పద రీతిలో మృతి

Couple Suspicious Death in Car Tamil nadu - Sakshi

కారులో మృతదేహాలు

చెన్నై,సేలం: యువ జంట అనుమానాస్పద రీతిలో కారులో మృతదేహాలుగా కనిపించిన సంఘటన సేలంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. సేలం సెవ్వాపేటకు చెందిన వెండి వ్యాపారి గోపి. ఈయన కుమారుడు సురేష్‌ (22). ఇతను కూడా అదే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సురేష్‌  ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కోసం కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పలు ప్రాంతాలలో గాలించారు. కాగా, గుహై ప్రాంతంలోని తిరుచ్చి రోడ్డులో గోపికి సొంతమైన కారు షెడ్డు ఉంది. ఈ షెడ్డు వద్ద మంగళవారం రాత్రి సురేష్‌ బైకు కనిపించింది. చాలాసేపు ఆ బైకు బయటే ఉండడంతో సందేహించిన స్థానికులు షెడ్‌లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న కారులో సురేష్, ఒక యువతి మృతదేహాలుగా కనిపించారు.

సమాచారం అందుకున్న సెవ్వాపేట పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న సురేష్, ఆ యువతి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో సురేష్‌తో పాటు మృతి చెందిన యువతి గుహై ప్రాంతానికి చెందిన జ్యోతి అని, ఆమె సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నట్టు తెలిసింది. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు వ్యతిరేకత తెలపడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఆత్మహత్య చేసుకున్నారా లేదా కారులో గ్యాస్‌ లీకేజీ వల్ల మృతి చెందారా అనే విషయం స్పష్టమవుతుందని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top