మహిళ గొంతుకోసి తానూ ఆత్మహత్య

Auto Driver Killed Woman And Commits Suicide In Guntur - Sakshi

స్నేహితురాలి గొంతు కోసి చంపిన యువకుడు

ఆ తరువాత పురుగుమందు తాగి ఆత్మహత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ మహిళ గొంతు కోసి తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద గురువారం కలకలం రేపింది. మృతులిద్దరూ సత్తెనపల్లి మండలం నందిగం వాసులు.

రాజుపాలెం(సత్తెనపల్లి): వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలోని గోరంట్ల మేజర్‌ కాలువ ఒడ్డుపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లి మండలం నందిగం గ్రామానికి చెందిన ఎస్‌కె.మౌలాలీ(30) ఆటో డ్రైవర్‌. అదే గ్రామానికి చెందిన వివాహిత టపా మల్లేశ్వరి(28)తో కొంత కాలంగా అతనికి వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో  మల్లేశ్వరితో కలిసి ఎస్‌కె.మౌలాలి ఆటోలో గోరంట్ల మేజర్‌ కాలువ ఒడ్డుకు చేరారు. ఇద్దరి మధ్య కీచులాట జరగడంతో మౌలాలి మద్యం మత్తులో మల్లేశ్వరిని కూరగాయలు కోసే కత్తితో  గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత మౌలాలీ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అక్కడే మృతి చెందాడు.  ఈ విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల రూరల్‌ సీఐ సుబ్బారావు, రాజుపాలెం ఇన్‌చార్జి ఎస్‌ఐ జైకుమార్‌  ఘటనాస్థలానికి చేరుకొని ఆటోలో పడి ఉన్న మృతదేహాలను కిందికి దించారు. అనంతరం వివరాల కోసం ఆటో నంబర్, ఆధాకార్డు ఆధారంగా బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మల్లేశ్వరి భర్తకు ఫోన్‌చేసి విషయం తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలు మల్లేశ్వరి పూర్తి వివరాలు తెలియలేదు.

మౌలాలీ భార్య ఇటీవలే మృతి
మృతుడు మౌలాలి భార్య సాదియ మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో మౌలాలీపై కేసు నమోదైంది. భర్తపై అనుమానంతో భార్యాభర్తలు ఇరువురు తరుచుగా గొడవ పడేవారని, ఆ నేపథ్యంలోనే సాదియ ఆత్మహత్య చేసుకుందని సమాచారం. మౌలాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top