గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్ | Reliance Entertainment To Invest In Indian Gaming Start-Ups | Sakshi
Sakshi News home page

గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్

Apr 27 2016 11:44 AM | Updated on Sep 3 2017 10:53 PM

గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్

గేమింగ్ స్టార్టప్‌లలోకి రిలయన్స్

అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌పై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దృష్టి సారించింది. ఈ ఏడాది 20 గేమింగ్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

భారతదేశంలో మొబైల్ గేమింగ్ క్రమేపీ బలంగా పుంజుకుంటోంది. ఈ రంగంలో స్టార్టప్‌లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌పై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఎక్కువగా దృష్టిసారించింది. ఈ ఏడాది 20 గేమింగ్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వీటికి మార్కెటింగ్, టెక్నాలజీ పరంగా సాయపడేందుకు రూ. 33.28 లక్షల (50వేల డాలర్లు) పెట్టుబడులను రిలయన్స్ గేమ్స్ ప్రకటించింది.

వచ్చే 18-24 నెలల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ మారుతుందని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ డిజిటల్ సీఈవో అమిత్ ఖండుజాని అన్నారు. ఈ క్రమంలో దేశీయ మొబైల్ గేమ్ మార్కెట్ వృద్ధిచెందడం గేమ్ డెవలపర్స్ కు చక్కని అవకాశమని తెలిపారు. కొన్నేళ్ల క్రితం కేవలం 40 గేమింగ్ స్టార్టప్ లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 250కు పైగా ఉన్నట్టు ఆయన చెప్పారు. భారత మార్కెట్ అభివృద్ధి చెందుతున్న గేమ్ హబ్ అని, వచ్చే 3-4 ఏళ్లలో దాదాపు 50వేల మంది నిపుణులు దీనిలో భాగస్వాములవ్వాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

రిలయన్స్ అనిల్ ధీరూభాయి గ్రూపునకు చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌ టీమ్‌తో భాగస్వామి అవుతున్నట్టు అమిత్ ప్రకటించారు. దీంతో రాజ్‌కోట్‌కు చెందిన ఈ టీమ్ కు అధికారిక భాగస్వామిగా రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ మారింది. రిలయన్స్ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ స్టూడియోలతో కలిసి రిలయన్స్ గేమ్స్ పనిచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement