వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో జిల్లా సంబరాల్లో మునిగితేలింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో జిల్లా సంబరాల్లో మునిగితేలింది. ఆయనకు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినట్టు ప్రకటించగానే సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి మారుమూల పల్లె వరకు పులకించిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలకు అంతే లేకుండాపోయింది. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లోటస్పాండ్లోని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నివాసంలోనే ఉన్నారు.
పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, ఇతర నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్ ఈ సంతోషకర క్షణాల్లో పార్టీ అభిప్రాయాన్ని మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డితోపాటు మరికొందరు సమన్వయకర్తలు కూడా హైదరాబాద్లోనే సంబరాలు జరపుకున్నారు. ఇక జిల్లాలో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సాహాలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఏడాదిన్నర తరువాత ఒంగోలులోని జిల్లా కార్యాలయం సంబరాల్లో మునిగితేలింది. పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ , గిద్దలూరు సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, కనిగిరి సమన్వయకర్త కాటం అరుణమ్మ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కఠారి రామచంద్రరావు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, ఒంగోలు పట్టణ శాఖ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు వేమూరి బుజ్జి, కంచర్ల సుధాకర్, పోకల అనూరాధ, కటారి శంకర్లతోపాటు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాల్లో మునిగితేలారు. దాదాపు రెండుగంటలపాటు జిల్లా పార్టీ కార్యాలయం ఆనందోత్సాహాల సందడితో దద్దరిల్లిపోయింది. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు బైక్లతో భారీ ర్యాలీగా చర్చి సెంటర్కు చేరుకున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోకుండా సంబరాలు జరుపుకున్నాయి. అద్దంకిలో సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ కేక్కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఆనందోత్సాహాలను అందరితో పంచుకున్నారు. చీరాలలో కూడా పార్టీ సంబరాలు మిన్నంటాయి. సమన్వయకర్తలు పాలేటి రామారావు, అవ్వారు ముసలయ్య, యడం చిన రోశయ్య, సజ్జా హేమలత పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి సంబరాలు చేసుకున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి నేతలు, కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. సంతనూతలపాడులో సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, అమృతపాణి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి సంతోషాన్ని పంచుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు.
మార్కాపురంలో సమన్వయకర్త ఉడుముల శ్రీనివాసరెడ్డి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేశారు. నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కందుకూరు, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శిలలో కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు బాణ సంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చినందుకు ఈ విధంగా జిల్లాలోని అన్ని నియోకజకవర్గాల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. మండలాలు, పంచాయతీలు సంతోషంతో పులకించిపోయాయి. వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావడమే కాదు... ఆయన త్వరలో నిర్దోషిగా కూడా నిరూపితమవుతారని పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో జిల్లాతోపాటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న విశ్వాసాన్ని ప్రకటించారు.
తెలుగు ప్రజలకు పండుగ రోజు
‘ఇది తెలుగువారందరికీ పండుగ రోజు. వైఎస్.జగన్మోహన్రెడ్డి రాక కోసం కోట్లాది తెలుగు ప్రజల 16 నెలల నిరీక్షణ ఫలించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం అందర్నీ ఆనందపరవశంలో ముంచెత్తింది. అందుకే రాష్ట్రమంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు బెయిల్ రావడమే కాదు...త్వరలో వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్దోషిగా కూడా నిగ్గుతేలుతారు. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై అక్రమ కేసులు బనాయించాయి. అసలు క్విడ్ప్రోకోనే జరగలేదని సీబీఐ ఎట్టకేలకు అంగీకరించడమే ఇందుకు నిదర్శనం. వైఎస్.జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంగా అన్ని కేసుల నుంచి విముక్తమవుతారు. తెలుగు జాతి ఆశలు, ఆకాంక్షలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి పదవి చేపడతారు. రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుపుతారు.