దోస్తీ కటీఫ్ | Telangana effect: Andhra minister Sridhar Babu quits Kiran Reddy ministry over portfolio rejig | Sakshi
Sakshi News home page

దోస్తీ కటీఫ్

Jan 3 2014 2:56 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం విసిరిన బంతితో దోస్తీ ఖటీఫ్ అయింది. ఒకప్పుడు సీఎంకు విధేయ వర్గీయునిగా గుర్తింపు పొందిన మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పుడు ఏకంగా మంత్రివర్గం నుంచి వైదొలిగారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  సీఎం విసిరిన బంతితో దోస్తీ ఖటీఫ్ అయింది. ఒకప్పుడు సీఎంకు విధేయ వర్గీయునిగా గుర్తింపు పొందిన మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పుడు ఏకంగా మంత్రివర్గం నుంచి వైదొలిగారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించే సమయంలో శాసనసభా వ్యవహారాల నుంచి తనను తొలగించడంతో మనస్తాపానికి గురైన మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖకు గుడ్‌బై చెప్పారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదింపారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు సీఎం కిరణ్‌కుమార్ అనూహ్యంగా మంత్రుల శాఖలను మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బంద్ పాటించడంతోపాటు రెండోరోజు గురువారం కూడా ఆందోళనలు చేపట్టింది. అసంతృప్తి చెందిన మంత్రి రాజీనామాకు సిద్ధపడడంతో జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఉదయాన్నే హైదరాబాద్ చేరుకున్నారు.
 
 మంత్రి ఇంటి వద్ద మకాం పెట్టారు. దీంతో రాత్రి వరకు రాజీనామాపై ఉత్కంఠ కొనసాగింది. తనను కలిసేందుకు వచ్చిన జిల్లా నేతలతో శ్రీధర్‌బాబు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. అసలు రాజీనామా చేయాలా? వద్దా? చేస్తే ఎలాంటి పరిణామాలుంటాయి? అనే విషయాలపై చర్చించారు. విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, బొమ్మ శ్రీరామ్, ఏనుగు మనోహర్‌రెడ్డితోపాటు జిల్లా నేతలతో చర్చలు జరిపారు.
 
 జిల్లా నేతల సూచనల మేరకు ఎట్టకేలకు  రాజీ నామా చేస్తున్నట్లు గురువారం రాత్రి మంత్రి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. నిజానికి శ్రీధర్‌బాబు బుధవారమే ఈ నిర్ణయం తీసుకున్నారు. జానారెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రాంత మిగతా మంత్రుల ఒత్తిడితో తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. రాజీనామా చేస్తే అందరు మం త్రులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని, అవసరమైతే అందరూ రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రాంత పార్టీ నేతల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
 
 కానీ అవేమీ పట్టించుకోకుండా తన శాఖను మార్చడం తెలంగాణకు జరిగిన అవమానంగా భావించిన శ్రీధర్‌బాబు రాజీనామాకు మొగ్గు చూపారు. పదవిలో ఉన్నంతకాలం సీఎంకు సన్నిహితునిగా గుర్తింపు పొందిన శ్రీధర్‌బాబు రాజీనామా చేయడంతో నిజంగానే ఇద్దరి మధ్య వైరం పెరిగిందా? అనుమానాలు, అపార్థాలకు తావు లేకుండా ఉండేందుకే శ్రీధర్‌బాబు తన పదవీత్యాగం చేశారా? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. శాఖలు మార్చిన సమయంలో తన సన్నిహితుడైన శ్రీధర్‌బాబు ఇమేజీని పెంచేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని, ఏకంగా పదోన్నతి కల్పించి వాణిజ్య పన్నులశాఖ కట్టబెట్టారని ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవిని త్యాగం చేయడంతో వీటన్నింటికీ తెరపడింది.
 
 చిన్న వయసులోనే ఎన్నో పదవులు..
 మంథని: మాజీ స్పీకర్ శ్రీపాదరావు మరణాంతరం ఆయన వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన శ్రీధర్‌బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరస గా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. 2000లో ఏఐసీసీ సభ్యుడిగా నియమితులై ఆ పదవిలో రెండేళ్లు కొనసాగారు. డీసీసీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు, టీటీడీ బోర్డు సభ్యుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2004లో మంత్రి పదవి వస్తుందని ఆశించగా, ప్రభుత్వ విప్‌తోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2009 మే 28న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రవాసాంధ్రుల శాఖ మంత్రిగా వైఎస్సార్ కేబినేట్‌లో పదవి దక్కించుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం రోశయ్య కేబినేట్‌లోనూ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా నియామకం కావడంతో 2010 డిసెంబర్ ఒకటిన పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, శాసనసభ వ్యవహరాల మంత్రిగా మళ్లీ చోటు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement