ఎవడ్రా ఇక్కడ.. ఎక్కడ్రా కాంట్రాక్టర్‌ | tdp leaders fight for Kickbacks | Sakshi
Sakshi News home page

ఎవడ్రా ఇక్కడ.. ఎక్కడ్రా కాంట్రాక్టర్‌

Oct 9 2017 5:07 AM | Updated on Aug 30 2018 4:15 PM

tdp leaders fight for Kickbacks - Sakshi

కదిరి: నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా ఇక్కడి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌కు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. మాకే గిట్టుబాటు కాదని చెప్పినా, నష్టాలొస్తాయని విన్నవించుకున్నా, ఎందుకివ్వాలని ప్రశ్నించినా ఆయన అనుచరులు వచ్చి పనులను అడ్డుకుంటారు. ఇలా గతంలో ఎన్నోసార్లు హంద్రీనీవా పనులను అడ్డుకున్నారు. ఇంకా చాలామంది కాంట్రాక్టర్లను మామూళ్ల కోసం బెది రించారు. తాజాగా ఈ శనివారం ఎన్‌పీకుంట మండలం వెలిచెలమల – రెక్కమాను మధ్య చేస్తున్న రోడ్డు పనులనూ తన అనుచరులను పంపి అడ్డుకున్నారు.

కదిరి – వెలిచలమల మధ్య రోడ్డు చాలా అధ్వానంగా ఉండటంతో ఎన్‌పీకుంట మండలం ఎస్‌కే తండాకు చెందిన శివక్రిష్ణ నాయక్‌ అనే గిరిజనుడు తోటి గిరిజనులతో కలిసి మీకోసంలో వినతిపత్రం (నెం.1100120 – 7783471) ఇచ్చారు. వెంటనే ఆ రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపడం.. టెండర్లు పిలవడం చకచకా జరిగిపోయాయి. ఈ టెండర్‌ను కదిరి మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ రమేష్‌రెడ్డికి చెందిన శివసాయి కన్‌స్ట్రక్షన్స్‌వారు రూ.2.02 కోట్లకు దక్కించుకున్నారు. పనులు ప్రారంభించాలనుకుంటూ ఉండగానే తనకు రూ.20 లక్షలు ఇవ్వాలంటూ టీడీపీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్‌ మామూళ్ల కోసం లైన్లోకి వచ్చారు. కాంట్రాక్టర్‌ అందుకు ఒప్పుకోకపోవడంతో ‘పనులు ఎలా చేస్తావో నేనూ చూస్తా’నంటూ నెలల తరబడి అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఆ రోడ్డు పనులను 6 నెలల్లో ముగిం చాలన్న గడువుముంచుకొస్తుండటంతో వారం రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్‌ ధైర్యం చేసి పనులను ప్రారంభించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట ఆ పనులను ఎలాగైనా అడ్డుకోవాలని సంబంధిత అధికారుల ద్వారా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌అండ్‌బీ డీఈ రాజగోపాల్‌ సైతం సెలవుపై వెళ్లిపోయినట్లు తెలిసింది.

అధికారుల ద్వారా పనులు ఆపడం సాధ్యం కాకపోవడంతో కందికుంట శనివారం నేరుగా రంగంలోకి దిగారు. తానే 4 వాహనాల్లో అనుచరులను వెంటబెట్టుకుని బయలుదేరారు. అయితే ‘అన్నా మీరు అక్కడికి వెళ్లడం కరెక్ట్‌ కాదు.. ఈ విషయం పార్టీకి తెలిస్తే మీ రాజకీయ భవిష్యత్‌కే ప్రమాదం. ఇప్పటికే మీపై ముఖ్యమంత్రితోపాటు లోకేష్‌బాబు కూడా సీరియస్‌గా ఉన్నారు. దయచేసి మీరు అక్కడికి వెళ్లే ప్రయత్నం మానుకోండి’ అని సన్నిహితులు అడ్దు చెప్పడంతో తను వెనుదిరిగి ఎన్‌పీకుంట మండలం వెలిచలమల సర్పంచ్‌ విజయ్‌కుమార్‌కు తోడుగా కొందరు అనుచరులను ఏపీ04 – క్యూ.2345 నెంబర్‌ వాహనంలో పంపారు.

కందికుంట అనుచరులు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ‘రేయ్‌ ఎవడ్రా ఇక్కడ? కాంట్రాక్టర్‌ ఏడీ?.. ఆర్‌అండ్‌బీ అధికారులు లేకుండానే రోడ్డుపని ఎలా చేస్తారు? ఆపండ్రా పని. కందికుంట అన్న చెప్పినా పనులు ఆపలేదంటే మీకెంత ధైర్యంరా? రేయ్‌.. ఆపండ్రా పనులు’ అంటూ అక్కడున్న కూలీలను బెదిరించారు. ‘అధికారులు రోజంతా ఇక్కడే ఉండరన్నా.. పని దగ్గర రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతారు. మళ్లీ వస్తారు. ఇంతకీ పని ఎందుకాపాలి?’ అని కూలీలు అడిగితే ‘రేయ్‌ మమ్మల్నే ప్రశ్నిస్తావురా? వీనికి మూడింది రా..’ అని కందికుంట అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూలీలు భయపడి పనులు ఆపేశారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ రాజగోపాల్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement