
సేవల్లో స్ఫూర్తిదాతలు
పట్టణానికి చెందిన వీఎన్ఎం ఫౌండేషన్ చైర్మన్ వి.వెంకటేష్ సామాజిక సేవలకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. సేవలు చేయడం తన హాబీగా మార్చుకున్నారు.
సమాజ హితమే వారి మతం.. అభిమతం.. గమ్యం. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తూ... ప్రజలకు తాగునీరు, బస్ షెల్టర్ కష్టాలు తీర్చుతూ.. కనీస సదుపాయూల కల్పనకు తమవంతు సాయం చేస్తూ.. సహాయం చేడమే దినచర్యలో భాగంగా మార్చుకున్నారు... ఇచ్ఛాపురానికి చెందిన వి.వెంకటేష్, నారాయణమూర్తి, సుధీర్కుమార్. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవలు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. స్ఫూర్తిదాతలుగా నిలిచారు.
ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన వీఎన్ఎం ఫౌండేషన్ చైర్మన్ వి.వెంకటేష్ సామాజిక సేవలకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. సేవలు చేయడం తన హాబీగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల జన్మదినాలు సందర్భంలో లక్షల రూపాయల విలువైన వస్తువులను ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇటీవల మండలం, పట్టణంలోని పలు పాఠశాలల్లో చదువుతున్న సుమారు 15 వందల మంది విద్యార్థులకు బూట్లు, నోటు పుస్తకాలను పంపిణీ చేస్తారు. పట్టణంలోని సుమారు 2 వేల మంది కార్మికుల బీమా ప్రీమియం చెల్లించారు.
ఇచ్ఛాపురం ప్రభుత్వ మోడల్ స్కూల్కు 15 సీలింగ్ ఫ్యాన్లు, మునిసిపాల్టీకి వీధి లైట్లు సమకూర్చారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి కళాశాల ఫీజు కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. పేద టైలర్కు రూ. పదివేలతో కుట్టుమిషన్ కొనిచ్చారు. నిరంతరం శ్రమించే ట్రాఫిక్ మైత్రి గార్డుకు రూ.పదివేల ఆర్థిక సహాయం అందించారు. మునిసిపల్, మండలంలో మృతిచెందిన వారి కోసం ఫ్రీజర్ను ఉచితంగా అందజేస్తున్నారు. కవిటి మండలానికి చెందిన ప్రతిభావంతురాలైన పేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేశారు.
గత ఏడాది వికలాంగులకు ట్రై సైకిళ్లు, విద్యార్థులకు స్కూల్ బాగులు అందించారు. ఇలా ఏటాఎదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమాజంలో ఏదో ఒక వర్గానికి సహాయం అందిస్తూనే ఉన్నారు వెంకటేష్. ఇదే సేవా తత్పరత వేంకటేష్ భార్య, పిల్లల్లో కూడా ఉండడం విశేషం. ఇతరుల సహాయం చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అంటారు వెంకటేష్.
సేవలతో మార్గదర్శి
పట్టణంలో సేవా కార్యక్రమాలకు సహాయం అందించడానికి ముందుకు వచ్చే ప్రధాన వ్యక్తుల్లో వల్లంపాటి సుధీర్ కుమార్ ఒకరు. తన తల్లిదండ్రుల పేరు మీద 8 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. దాసన్నపేట వద్ద బస్షెల్టర్ నిర్మించి ప్రయూణికుల కష్టాలు తీర్చారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి బస్షెల్టర్ పక్కనే ఐస్వాటర్ ప్లాంట్ను నెలకొల్పారు. పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకు ఒక బోర్ నిర్మించారు. స్థానికంగా జరిగే ఎన్నో కార్యక్రమాలకు ఈయన గుప్తదానాలు చేస్తుంటారు. సేవచేసే సామర్థ్యం భగవంతుడు తనకు కల్పించడం ఆనందంగా ఉందంటారు సుధీర్.
మునిసిపల్ ప్రజల దాహార్తి తీర్చడానికి..
మున్సిపాలిటీ ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు వ్యాపారి వల్లంపాటి నారాయణమూర్తి ముందుకొచ్చారు. ఎన్టీఆర్ సుజలధార పథకం ఏర్పాటుకు రూ.2.50లక్షలను సమకూర్చారు. ఉచితంగా నీటిని పం పిణీ చేస్తున్నారు. పట్టణంలోని ఆలయాల నిర్మాణానికి, ఆపదలో ఉన్న పేదవారికి తనవంతు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదంటారు నారాయణమూర్తి.