సమయం ముగిసినా బారులు తీరిన ఓటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో క్యూ లైన్లలో నిలుచున్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి మరి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసేసరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకే ఏపీలో 74 శాతం పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికి.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం.. పార్టీల నేతలు వాగ్వాదాలకు దిగడంతో పోలింగ్కు కొంత ఆలస్యమైంది. ఇక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి.