ప్రసరించని.. కిరణం | people felt dissatisfaction with kiran kumar reddy | Sakshi
Sakshi News home page

ప్రసరించని.. కిరణం

Feb 21 2014 3:30 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముందుంది..మంచికాలం అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినన్నీ రోజులు ప్రజల్లో ఓ ఆశ రేకెత్తించారు.

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ముందుంది..మంచికాలం అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినన్నీ రోజులు ప్రజల్లో ఓ ఆశ రేకెత్తించారు. జనాలు కూడా నమ్మారు. కానీ ఆయన చేసిన అభివృద్ధి మాత్రం అంతంతే. దాదాపు 39 నెలల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన కిరణ్‌కుమార్‌రెడ్డిపై జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2010 నవంబర్ 25న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన ఆయన  పదవిలో 39 నెలల పాటు ఉన్నా ప్రత్యేకత చాటుకోలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ కిరణ్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఆయన పాలన ఎలా ఉందో ఊహించుకోవచ్చు. మహానేత  వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞాన్ని, సంక్షేమ పథకాలను కిరణ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
 జిల్లాకు 15 సార్లు : 39 నెలల పాటు రాష్ట్రాన్ని పాలించిన కిరణ్ జిల్లాకు 15 సార్లు వచ్చారు. ఇన్నిసార్లు వచ్చినా జిల్లాపై తనదైన ముద్ర వేయలేకపోయారు. పథకాలను ఆడంబరంగా ప్రకటించడం, ప్రారంభించడం తప్ప తర్వాత పట్టించుకోకపోవడంతో దాదాపు అన్ని పథకాల అమలు అస్తవ్యస్తంగా తయారైంది. ఇందిరజలప్రభ, రాజీవ్ యువ కిరణాలు, బంగారుతల్లి, అమృత హస్తం, అమ్మహస్తం, స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు తదితర పథకాలన్నీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినవవే. ఇందులో ఒక్కటి కూడా విజయవంతమైన దాఖలాలు లేవు. పథకాలను అధికారులే విమర్శిస్తున్నారంటే అవి ప్రజల్లోకి ఎంత మేర వెళ్లాయో తెలుస్తోంది.
 
 నేడు జిల్లాలో అమ్మహస్తం పథకం అమలు దయనీయంగా మారింది. కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఎలాంటి భరోస ఇవ్వలేకపోయాయి. రాజీవ్ యువకిరణాలు నిరుద్యోగుల్లో వెలుగులు నింపడంలో విఫలమయింది. ఇందిరజలప్రభ కింద ఎస్సీ, ఎస్టీ రైతుల భూములకు నీరిచ్చింది నామమాత్రమే. మహిళలకు వడ్డీలేని రుణాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న జిల్లాలో ప్రతినెల మహిళల నుంచి వడ్డీ అసలు వసూలు చేస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. స్త్రీ నిధి కొన్ని మండలాలకు మాత్రమే పరిమితమైంది.
 
 పథకాల అమలులో విఫలం:  
 దివంగత ముఖ్యమంత్రి హయాంలో ఆరోగ్యశ్రీ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ అమలు అస్తవ్యస్తమైంది. గర్భిణులు, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులకు ప్రాణాధారమైన 108 అంబులెన్‌‌సలు  నేడు కుయ్యో ముర్రో అనే పరిస్థితి ఏర్పడింది. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన కిరణ్ అధికారికంగా 26 హామీలు ఇచ్చారు. ఇందులో చాలా వరకు పెండింగ్‌లో ఉండిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement