పురపాలన ఎన్నికలకు తెర లేచింది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల అయ్యింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పురపాలన ఎన్నికలకు తెర లేచింది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల అయ్యింది. దీంతో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలి టీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా... ప్రజాప్రతి నిధులు చేపట్టే అభివద్ధి పనులు, పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేకుపడింది. ఇకపై అందరూ కూడా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యవహరించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం జిల్లా కలెక్టర్ పవనసూర్య ప్రద్యుమ్న వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం అయ్యా రు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులతో చర్చించారు.
2010 సెప్టెంబర్ 29న నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం అదే రోజున స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కోర్టులు ఆదేశించినా.. బీసీ ల గణన, ఓటర్ల జాబితాల పేరిట ప్రభుత్వం కాలయాపన చేసింది. ప్రత్యేకాధికారుల పాలనను రెండు పర్యాయాలు మించి పొడిగించే అవకాశం లేకున్నా.. ప్రభుత్వం ప్రత్యేక కారణాలు చూపుతూ పదే పదే స్పెషలాఫీసర్లను నియమించింది.
ఫలితంగా రెండోసారి 2011 సెప్టెంబర్ 30న, మూడోసారి 2012 సెప్టెంబర్ 28న, మూడేళ్లలో మూడు సార్లు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమిస్తూ మున్సిపల్ ఎన్నికలను దాటవేసింది. 2013 సెప్టెంబర్లో సైతం మరోసారి ప్రత్యేకాధికారులకే బాధ్యతలు అప్పగించగా.. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత హైకో ర్టు ఆదేశంతో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏప్రిల్ 2 తర్వాత జిల్లాలోని పురపాలక సంఘాలకు కొత్త పాలక వర్గాలు రానున్నాయి.