టన్నుకు పైగా గంజాయి స్వాధీనం | more one ton drugs are seized | Sakshi
Sakshi News home page

టన్నుకు పైగా గంజాయి స్వాధీనం

Jan 1 2014 3:04 AM | Updated on May 25 2018 2:29 PM

జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు, అటవీసిబ్బంది దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్న 1006 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


 నర్సీపట్నం రూరల్/గొలుగొండ/మాడుగుల, న్యూస్‌లైన్ : జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు, అటవీసిబ్బంది దాడులు జరిపి అక్రమంగా తరలిస్తున్న 1006 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి పైచిలుకు ఉంటుంది. మూడు కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తకోట సీఐ పి.వి. కృష్ణవర్మకు అందిన సమాచారం మేరకు నర్సీపట్నం, కొత్తకోట పోలీసులు సంయుక్తంగా రోలుగుంట మండలం వడ్డిప సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు. టాటా టయోటా వాహనాన్ని ఆపి రికార్డులు పరిశీలించగా వాహనానికి సంబంధించిన రికార్డులకు,నంబరుకు పొంతనలేకపోవడంతో అనుమానించిన పోలీసులు దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. 80 సంచుల్లో ప్యాకింగ్ చేసిన 540 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దానిని నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో రత్నంపేటకు చెందిన సన్నవాడ నాగబాబు, పందూరి ప్రసాద్, పెదబొడ్డేపల్లికి చెందిన రెడ్డి నానిబాబులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు. ఈ దాడుల్లో రోలుగుంట ఎస్‌ఐ జి.ఎన్.అప్పన్న, నర్సీపట్నం పట్టణ ఎస్‌ఐ అప్పారావు, శిక్షణ ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 జీకే వీధి మండలం సిరిబాల నుంచి టాటామ్యాజిక్ వ్యాన్‌పై తరలిస్తున్న సుమారు 450 కిలోల గంజాయిని గొలుగొండ మండలం  కె.డి.పేట సమీపంలోని భీమవరం చెక్‌పోస్టు అటవీ సిబ్బంది మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మాటువేసి ఉన్న అటవీ సిబ్బంది మాటువేసి వాహనాన్ని పట్టుకున్నారు. అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వాహనదారులు రూ.50వేలు ఇస్తామని బేరాలు సాగించడంతో అటవీశాఖ అధికారులు కె.డి.పేట ఎస్‌ఐ పేర్రాజుకు సమాచారమందించారు. పోలీసులొచ్చి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్రవాహనంపై పెలైట్‌గా వ్యవహరించిన వ్యక్తి పరారయ్యాడు. వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కొయ్యూరు ఎస్‌ఐ సి.హెచ్.వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో మంగళవారం సాయంత్రం 16 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ బి.హరి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరిని ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో పట్టుకున్నామన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement