
అధికార లాంఛనాలతో కొల్లూరి అంత్యక్రియలు
మాజీ ఎమ్మెల్సీ, తెలుగు విద్యార్థి సంపాదకుడు కొల్లూరి కోటేశ్వరరావు అంత్యక్రియలు శనివారం మచిలీపట్నంలో అధికార లాంఛనాలతో జరిగాయి.
మచిలీపట్నం : మాజీ ఎమ్మెల్సీ, తెలుగు విద్యార్థి సంపాదకుడు కొల్లూరి కోటేశ్వరరావు అంత్యక్రియలు శనివారం మచిలీపట్నంలో అధికార లాంఛనాలతో జరిగాయి. ఆయనరెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలుగు విద్యార్థి మాసపత్రిక ప్రధాన సంపాదకుడిగా, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు. భాస్కరపురంలోని కొల్లూరి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, మోక్షధామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
బందరు ఆర్డీవో పి.సాయిబాబు నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొల్లూరి మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్, బూరగడ్డ శ్రీకుమార్, మాదివాడ రాము, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబటి కాంతారావు, మాజీ ఏఎస్పీ ప్రేమ్కుమార్, టీడీపీ నాయకులు మోటమర్రి వెంకట బాబాప్రసాద్, కొనకళ్ల బుల్లయ్య, బత్తిన దాసు తదితరులు ఆయన మృతదేహాన్ని సందర్శించినవారిలో ఉన్నారు.