
మంగళవారం రాత్రి ఇబ్రహీంపేట క్రాస్ రోడ్డు వద్ద మంటల్లో దగ్ధమవుతున్న అటవీప్రాంతం
సాక్షి, కుక్కునూరు: అడవిలో చెలరేగిన మంటలు ఊరువైపు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైన ఘటన మండలంలోని బంజరగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వారం రోజులుగా మండలంలోని ఇబ్రహీంపేట నుంచి బంజరగూడెం గ్రామం వరకు ఉన్న అటవీప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అడవిలో నిప్పు రాజేస్తున్నారు. ఎండాకాలం కావడంతో మంటలు అడవిమొత్తం వ్యాపించుకుంటూ గ్రామం వైపు మరలుతున్నాయి.
బుధవారం బంజరగూడెం జామాయిల్ తోటలో వ్యాపించిన మంటలు ఊరువైపు వస్తుండడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. వారు వెంటనే వెళ్లి మంటలను అదుపు చేశారు. అయితే గత వారం రోజులుగా అటవీప్రాంతం మంటల్లో చిక్కుకుంటున్న అటవీశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా బీడీ ఆకుల కాంట్రాక్టర్లకు చెందిన మనుష్యులే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అటవీశాఖాధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకుని అటవీసంపదను వన్యప్రాణులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.