అప్‌డేట్స్‌: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌

AP Budget 2019 Live Updates - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అర్హులందరికీ సంక్షేమం అందేలా, అన్నదాతకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూపాయలు 2 ల‌క్షల 27 వేల 974 కోట్లతో బ‌డ్జెట్‌ను సభకు సమర్పించారు. ఈ ఏడాదికిగాను ద్రవ్య లోటును రూ. 35వేల 260 కోట్లుగా, రెవెన్యూ  లోటును రూ. 1778 కోట్లుగా బుగ్గన అంచ‌నా వేశారు. రాష్ట్ర జనాభాలో 60శాతంపైగా ఉన్న రైతులు, వ్యవసాయ సంబంధిత కుటుంబాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రైతుల‌కు వ‌రాలు కురిపిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నదాతకు అండ, చదువులకు అమ్మఒడి, యువతకు చేయూత, గ్రామాలకు సచివాలయాలు, వైద్యానికి ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు ప్రాధాన్యం, అర్హులందరికీ పింఛన్‌, దశల వారీగా మద్యపాన నిషేధం, అందరికీ గృహ వసతి, కల్యాణానికి కానుకలు ఇలా మెరుగైన పాలన అందిస్తామన్న హామీని మంత్రి బుగ్గన బడ్జెట్‌ ద్వారా నెరవేర్చారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్‌ అప్‌డేట్స్‌.. హైలెట్స్‌ ఇవి..

హైలెట్స్‌: 2019-20 ఏపీ మొత్తం బడ్జెట్‌: రూ. 2,27,974 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 35,260 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 1,778

అన్నదాతలకు అండ..
అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలిచింది ప్రభుత్వం. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలను ప్రకటించింది. రైతన్నలకు పెద్ద పీట వేస్తూ.. సాగును సంతోషంగా నిర్వహించేలా కేటాయింపులు చేసింది. వైఎస్సార్ రైతు భ‌రోసాకు రూ. 8750 కోట్లు కేటాయిస్తూ.. 15 లక్షలమంది కౌలు రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. పంట మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవ‌కాశం ఇస్తూనే... మెరుగైన ఫలితాలకు భరోసా ఇచ్చింది. 9 గంట‌ల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు రూ. 4,525 కోట్లు కేటాయించింది. ధ‌ర‌ల స్థిరీకరణ నిధికి 3 వేల కోట్లు, విప‌త్తు నిర్వహ‌ణ నిధికి 2 వేల కోట్లు, వైఎస్సార్ బీమా యోజ‌న కింద రైతుల పంట‌ల బీమా కోసం క‌ట్టే ప్రీమియం కోసం 1163 కోట్లు, ఆక్వా రైతుల‌కు విద్యుత్ స‌బ్సిడీ 475 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ రైతు భ‌రోసా కింద ఉచిత బోర్లకు 200 కోట్లు, విత్తనాల స‌ర‌ఫ‌రాకు 200 కోట్లు కేటాయించింది. ఇంకా మరిన్ని ఇతర పథకాల ద్వారా సాగు పూర్తిగా లాభదాయకమన్న ఆశాభావాన్ని బడ్జెట్‌ ద్వారా తీసుకొచ్చింది ప్రభుత్వం.

రైతు సంక్షేమానికి చేసిన కేటాయింపులివే:

  • రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత
  • రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
  • రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు
  • సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
  • ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 475 కోట్లు
  • రైతుల ఉచిత బోర్లకు రూ. 200 కోట్లు
  • రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు రూ. 200 కోట్లు

(చదవండి : రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌)
(చదవండి : రైతులు, కౌలు రైతులకు ‘భరోసా)

గ్రామ వాలంటీర్లకూ కేటాయింపులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రత్యేక కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి...

  • గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు
  • గ్రామ సచివాలయ నిర్వహణకు రూ. 700 కోట్లు
  • మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు
  • మున్సిపల్‌ సచివాలయాలకు రూ. 180 కోట్లు
  • సబ్సిడీ బియ్యం పథకానికి రూ. మూడువేల కోట్లు
  • ఏపీ పౌరసరఫరాలకు సాయం కింద రూ. 384 కోట్లు

బలహీన వర్గాల ఆడపడుచుకు కల్యాణ కానుక

  • బీసీలకు కల్యాణ కానుక కింద రూ. 300 కోట్లు
  • ఎస్సీలకు కల్యాణ కానుక కింద రూ. 200 కోట్లు
  • ఎస్టీ గిరిపుత్రికల కల్యాణ కానుక కింద రూ. 45 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం కింద షాదీ తోఫాకు రూ. 100 కోట్లు
  • కులాంతర వివాహ పథకానికి రూ. 36 కోట్లు

ఆశా వర్కర్లకు అండదండ

  • బడ్జెట్‌లో ఆశావర్కర్లకు ప్రభుత్వం అండగా నిలిచింది
  • ఆశావర్కర్ల కోసం రూ. బడ్జెట్‌లో రూ. 455.85 కోట్లు కేటాయింపు
  • ఆశావర్కర్ల వేతనాన్ని రూ. 10వేలకు పెంచుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే
  • వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లు
  • ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు
  • మెడికల్‌ భవనాల నిర్మాణానికి రూ. 68 కోట్లు
  • వైఎస్సార్‌ గిరిజన వైద్య కళాశాలలకు రూ. 66 కోట్లు
  • గురజాల ప్రభుత్వ కళాశాలకు రూ. 66 కోట్లు
  • విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ. 66 కోట్లు
  • శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి రూ. 50 కోట్లు
  • రాష్ట్ర క్యాన్సర్‌ నివారణ ఆస్పత్రికి రూ. 43 కోట్లు

మత్స్యకారులకు చేయూత

  • మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చేందుకు రూ. 100 కోట్లు
  • జెట్టీలు, హార్బర్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు
  • మత్స్యకారుల బోట్లకు సబ్సిడీ ఇచ్చేందుకు రూ. 100 కోట్లు
  • మత్స్యసంపద అభివృద్ధికి రూ. 60 కోట్లు
  • ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లు

సంక్షేమ రంగానికి వెన్నుదన్ను

  • సంక్షేమ రంగానికి రూ. 14,142 కోట్లు
  • వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు
  • ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు
  • డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు
  • పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు
  • వైఎస్సార్‌ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు
  • దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు
  • గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు
  • వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు
  • దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు
  • ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు
  • మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 1,150 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ. 2వేల కోట్లు
  • ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ. 400 కోట్లు
  • నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల సంక్షేమానికి రూ. 300 కోట్లు
  • చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 200 కోట్లు
  • ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ. 234 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు
  • న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ. 100 కోట్లు
  • కొత్తగా ప్రాక్టీస్‌ పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ. 10 కోట్లు

(చదవండి : వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు)

విద్యారంగానికి అగ్రతాంబూలం

  • విద్యారంగానికి మొత్తంగా రూ. 32,618.46 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ. 3,021.63 కోట్లు
  • మధ్యమిక విద్యకు రూ. 21,612.30 కోట్లు
  • అమ్మఒడి పథకానికి రూ. 6,455 కోట్లు
  • పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,500 కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు
  • పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు

కేటాయింపుల తీరూతెన్నులివి..

  • విద్యుత్‌ రంగానికి రూ. 6861.03 కోట్లు
  • వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ. 3,617కోట్లు
  • రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు
  • ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు
  • ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ. 31,654.75 కోట్లు
  • కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ. 250 కోట్లు
  • ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు
  • రాజధానిలో మౌలిక సదుపాయాలకు రూ. 500 కోట్లు
  • ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ. 500 కోట్లు
  • ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్‌ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు
  • విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ. 200 కోట్లు
  • రాష్ట్రంలో కొత్త రైల్వే నిర్మాణాల్లో రాష్ట్ర వాటా రూ. 185 కోట్లు
  • అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ. 100 కోట్లు
  • మంగళగిరిని మోడల్‌ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు
  • కడప యాన్యూటీ ప్రాజెక్టులకు రూ. 120 కోట్లు
  • స్మార్ట్‌సిటీస్‌ నిర్మాణం కోసం రూ. 150
  • అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూ. 446.77 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ. 4429.43 కోట్లు
  • మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధికి రూ. 6587 కోట్లు
  • ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్లు

ఆ ఫలాలను పక్కదారి పట్టించారా?

  • గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటు సాధించిందని ప్రచారం చేశారా? అది వాస్తవమా? కాదా? అన్నది పరిశీలిస్తున్నాం
  • నిజంగా రెండంకెల వృద్ధి జరిగితే ఆ ఫలాలను పక్కదారి పట్టించారా?
  • విలాసాలకు, అనవసర ఖర్చులకు ఆదాయాన్ని దారి మళ్లించారా?
  • రెండంకెల వృద్ధి నమోదైతే.. అన్నదాతల ఆకలి చావులు ఎందుకు చోటుచేసుకున్నాయి?

దయనీయమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చారు!

  • అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థను మా ప్రభుత్వం వారసత్వంగా పొందింది
  • విభజన సమయంలో రూ. 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 97,124 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 33,530కోట్లు) 2018-19నాటికి రూ. 2,58,928 కోట్లకు (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 1,92,820 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 66,108 కోట్లు) చేరుకుంది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా రూ. 10వేల కోట్లు రుణం తీసుకొని గత ప్రభుత్వం దారి మళ్లించింది. దీనికి అదనంగా రూ. 18వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • అంతేకాకుండా గత ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోని వాగ్దానాలను నెరవేర్చడానికి రూ. 45వేల కోట్ల వనరుల అంతరం ఉన్నది

మహాత్ముడి లక్ష్యసాధన దిశగా అడుగులు..

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్‌
  • తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాను
  • మా ప్రభుత్వ విజన్‌ సాకారం చేసే దిశగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది
  • రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం..నవరత్నాలకు పెద్ద పీట వేస్తున్నాం
  • మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తాం
  • పేదల కన్నీటిని తుడిచేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
  • ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం
  • కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తాం
  • సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తాం
  • ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా పూర్తి చేస్తాం
  •  ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లోనూ పారదర్శకత పాటిస్తాం
  • అవినీతి రహిత పాలనే మా లక్ష్యం
  • సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరోధించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటుచేశాం
  • గోదావరి నీళ్లను శ్రీశైలానికి తీసుకురావడం మా లక్ష్యం
  • ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తాం
  • జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం

ఇది ‘నవరత్నాల’ బడ్జెట్‌: బుగ్గన
నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. నవరత్నాల పథకాలతోపాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. కాలయాపన లేకుండా మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

నవరత్నాలకు పెద్దపీట
తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండనుందని సమాచారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం..
టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క  వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top