
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన శాసనసభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీర్ చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడింది.
అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారుపై చర్చిస్తున్నారు. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.