
బాగు చేస్తేనే భూగర్భ జలం వృద్ధి!
మోటకొండూర్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించేందుకు గత ప్రభుత్వ హయాంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు అలంకారప్రాయంగా మారాయి. మొత్తం ఎనిమిది వరకు చెక్డ్యాంలు నిర్మించగా అందులో కొన్ని చోట్ల పూడుకుపోయాయి. మరికొన్ని చెట్ల శిథిలావస్థకు చేరాయి. పూడుకుపోయిన చోట ఐదారు వేల రూపాయలు వెచ్చిస్తే అవి ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉన్నా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందుకు నిదర్శనం మోటకొండూర్ మండలం కొండపూర్లో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాం. దీన్ని 2017లో రూ.82.74లక్షల వ్యయంతో నిర్మించారు. నీళ్లు ఎక్కువగా నిలవకపోవడంతో రైతుల విజ్ఞప్తి మేరుకు చెక్డ్యాం ఎత్తు సిమెంట్ పట్టితో మరో ఫీటు పెంచారు. అయితే, ఈఏడాది వానాకాలంలో వచ్చిన వరదలకు సిమెంట్ పట్టి కొట్టుకుపోయింది. దాంతో చెక్డ్యాంలో నీరు నిలిచే పరిస్థితి లేకుండాపోయింది. వేసవిలోనే చెక్డ్యాంలను పరిశీలించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా అధికారులు గాలికొదిలేశారు.
ఫ చెక్డ్యాంల నిర్వహణ గాలికి
ఫ శిథిలమై, పూడుకుపోయినా పట్టని అధికారులు
ఫ రూ.కోట్లు వెచ్చించినా నిష్ప్రయోజనం