
పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలలో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సిల్వర్ సెట్లో ప్రతిభ
భీమడోలు: ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిల్వర్ సెట్ ఫలితాల్లో బీఎస్సీ లెక్కల విభాగంలో పయ్యావుల చిరు హాసిని మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఉమ్మడి రాష్ట్రాల్లో సిల్వర్ జూబ్లీ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలకు ప్రతి ఏటా సిల్వర్ సెట్ను నిర్వహిస్తుంది. శనివారం ఫలితాలు విడుదల కాగా.. చిరు హాసిని ప్రతిభ చాటింది. ఇందులో సీట్ సాధిస్తే మూడేళ్ల పాటు రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశం ఉంటుంది. చదువుతో పాటు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
నేడు తణుకులో ఉమ్మడి జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక
తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫెన్సింగ్ టీం సెలక్షన్లు ఈనెల 23వ తేదీన తణుకు విద్యా వ్యాలీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు మినీ (అండర్ 12) విభాగంలో 2014 నుంచి 2015లోపు పుట్టిన ఫెన్సర్లు, చైల్డ్ (అండర్ 10) విభాగంలో 2016 నుంచి 2018 మధ్యలో పుట్టిన ఫెన్సర్లు హాజరుకావాల్సిందిగా కోరారు. ఎంపికై న జట్లు ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడ జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 11వ చైల్డ్, మినీ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 96802 34566 నంబరులో సంప్రదించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనుమంట్ర: నవుడూరు– పొలమూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమూరు గ్రామానికి చెందిన కడలి నాగార్జున (33) మృతి చెందాడు. మోటార్ సైకిల్పై భీమవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న నాగార్జునను స్థానికుల సమాచారంతో 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పైలట్ బాలకృష్ణ తెలిపారు. పెయింటర్గా పనిచేస్తున్న నాగార్జున ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడని, అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అతని బంధువులు తెలిపారు.