రక్తదాత.. జీవన ప్రదాత | - | Sakshi
Sakshi News home page

రక్తదాత.. జీవన ప్రదాత

Jun 14 2025 6:34 AM | Updated on Jun 14 2025 6:34 AM

రక్తద

రక్తదాత.. జీవన ప్రదాత

రాయలంలో అత్యాధునిక బ్లడ్‌ బ్యాంక్‌

నూతన జిల్లా ఏర్పడ్డాక 2022లో అప్పటి కలెక్టర్‌ పి. ప్రశాంతి నేషనల్‌ రెడ్‌ క్రాస్‌ ద్వారా రూ. కోటి 50 లక్షలతో అత్యాధునిక పరికరాలను మంజూరు చేయించారు. అలాగే మండలంలోని రాయలం పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భవనాన్ని బ్లడ్‌ బ్యాంకు కోసం కేటాయించారు. ఉద్యోగులు, ప్రజల నుంచి జిల్లా శాఖ కోటి రూపాయల మేర విరాళాలు సేకరించి భవనంలో వైద్య పరికరాలు మార్పులు చేయించి వసతులు కల్పించారు. గతేడాది నవంబర్‌ 18న జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రెసిడెంట్‌, ప్రస్తుత కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి బ్లడ్‌ బ్యాంకును ప్రారంభించారు. అయితే తణుకు, నరసాపురంలోని రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులు హోల్‌ బ్లడ్‌ను మాత్రమే అందిస్తాయి. రాయంలోని ఏర్పాటు చేసి రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులో అత్యాధునిక పరికరాలు ద్వారా రక్తాన్ని ప్రాసెసింగ్‌ చేసి హోల్‌ బ్లడ్‌తో పాటు ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ అందించే విధంగా ఆధునిక వసతులు కల్పించారు. 8 వేల యూనిట్లు రక్తం నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

భీమవరం అర్బన్‌: ప్రమాద సమయాల్లో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన వారికి రక్తం చాలా అవసరం. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రెడ్‌క్రాస్‌ చొరవతో రక్తం అందుతుంది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికే కాకుండా తలసేమియా రోగులకు, ఇతర శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమయ్యే వారికి రెడ్‌క్రాస్‌ రక్తనిధి దన్నుగా నిలుస్తుంది. నోబుల్‌ బహుమతి గ్రహీతైన ఆస్ట్రేలియాకు చెందిన కార్ల ల్యాండ్‌ స్టైనర్‌ జయంతి, జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

దాతల అవసరం లేకుండానే

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్లడ్‌ బ్యాంకులు రక్తాన్ని అమ్మకూడదు. దాత నుంచి సేకరించాక మరొకరి శరీరంలోకి ఎక్కించేందుకు సురక్షితమో? కాదో నిర్ధారించే పరీక్షలు, భద్రపరిచేందుకు అవసమైన ప్రాసెసింగ్‌ చార్జీలు మాత్రమే తీసుకోవాలి. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో దాతలు రక్తాన్ని ఇచ్చిన తరువాత రోగికి కావాల్సిన బ్లడ్‌ గ్రూపుల రక్తాన్ని విక్రయిస్తారు. రెడ్‌క్రాస్‌ సొసైటీలో దాత అవసరం లేకుండా రోగికి కావాల్సిన బ్లడ్‌ను ప్రభుత్వం నిర్ణయించిన ప్రాసెసింగ్‌ చార్జీలతో అందజేస్తారు.

ముందుకు వచ్చిన ఉద్యోగులు

ప్రతి నెలా మొదటి, మూడో శుక్రవారాల్లో మండలంలోని రాయలంలో ఏర్పాటు రెడ్‌క్రాస్‌ సొసైటీలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 శిబిరాల ద్వారా 645 యూనిట్లు రక్తాన్ని సేకరించినట్లు జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ బద్రిరాజు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.

రక్తదానంతో ప్రాణాలకు రక్షణ

ఒక వ్యక్తి చేసే రక్తదానం 4 ప్రాణాలు కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ భాగాలుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌ బ్లడ్‌ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్‌, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటిని విడదీసి నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్‌ కానీ, ప్లాస్మాను గానీ దానం చేయవచ్చు. రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్‌ ప్రొఫైల్‌ తెలుసుకోవచ్చు. రక్తదానం చేయడం వల్ల పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, క్యాన్సర్లు వంటి రాకపోవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

రక్తదానం ఎవరు చేయాలంటే?

18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి బరువు 45 కిలోల పైన ఉండాలి. బీపీ అదుపులో ఉండాలి. తీవ్రమైన వ్యాధులు, మూర్చ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు ఉండకూడని వారు రక్తదానం చేయవచ్చు. అలాగూ హిమోగ్లోబిన్‌ 100 మిల్లీ లీటర్లు రక్తంలో 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి.

రక్తదానం ఎవరు చేయకూడదంటే?

గర్భిణులు, ప్రసవానంతరం 6 నెలల వరకు బిడ్డకు పాలిచ్చినంత కాలం, బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో సీ్త్రలు రక్తం ఇవ్వకూడదు. అలాగే టీకాలు వేసుకున్న రెండు వారాల లోపు ఇవ్వకూడదు. జంతువుల కాట్లకు గురైన ఏడాది లోపు ఇవ్వకూడదు. టిటానస్‌ (ధనుర్వాతం), డిప్తీరియా (కంఠవాపు), గ్యాస్‌ గ్యాంగ్రీన్‌ కోసం మందులు వాడినవారు పచ్చకామెర్లు వ్యాధి గ్రస్తులు కూడా రక్తం ఇవ్వకూడదు.

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల రక్తదానం

ప్రభుత్వ ఉద్యోగుల చొరవ అభినందనీయం

రక్తదాన శిబిరాలకు ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయం. వారు రక్తదానం చేయడంతోనే 645 యూనిట్ల రక్తాన్ని సేకరించగలిగాం. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని ఎంతోమందిని రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా కాపాడగలిగాం. రక్తం కొరతను తీర్చడం, అత్యవసర పరిస్థితులు, శస్త్ర చికత్సల సమయంలో ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది.

డాక్టర్‌ బద్రిరాజు, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌, భీమవరం

రక్తదాత.. జీవన ప్రదాత 1
1/2

రక్తదాత.. జీవన ప్రదాత

రక్తదాత.. జీవన ప్రదాత 2
2/2

రక్తదాత.. జీవన ప్రదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement