
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
నూజివీడు: నియోజకవర్గవ్యాప్తంగా మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టిదోపిడీ కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్న చందంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పగలు, రాత్రి లేకుండా చెరువుల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలోపంతో ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదైన మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. నూజివీడు డివిజన్కు సబ్కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో మట్టి దందా ఊపందుకుంది. మండలంలోని బోర్వంచ శివారు కొన్నంగుంట గోరింత చెరువు నుంచి మట్టి అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చెరువులో గ్రావెల్ పెద్ద ఎత్తున ఉండడంతో గ్రామంలోని పొలాల్లోకి సారవంతమైన పూడిక మట్టిని తోలుకునేందుకు అనుమతులు పొంది గ్రావెల్ను తవ్వి నూజివీడు పట్టణంలోనికి ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తూ మట్టిని విక్రయిస్తున్నారు. ట్రక్కు వెయ్యి రూపాయల నుంచి రూ.1200లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెరువులో 2014–19 సమయంలో తవ్విన అడ్డగోలు తవ్వకాలతో తూము కంటే పది అడుగుల లోతుకు చేరినా ఇరిగేషన్ అధికారులు మాత్రం మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై గ్రామానికి చెందిన పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధురాలు మృతి చెందినా ఆగని రవాణా
ముసునూరు: మండలంలోని గోపవరం, రమణక్కపేట, కొర్లగుంట,లోపూడి తదితర గ్రామాల్లో జేసీబీలు పెట్టి, రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో విలువైన చెరువు మట్టి తరలిస్తున్నారు.గోపవరంలో టీడీపి నేతలే ట్రాక్టర్ ట్రక్కు మట్టికి రూ.650 నుంచి రూ.700 గా నిర్ణయించి, మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గోపవరంలో మట్టి ట్రాక్టర్ ఢీకొట్టి వృద్ధురాలు మృతి చెందినా ఆగకుండా అక్రమ మట్టి రవాణా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే అక్రమ మట్టి రవాణాపై తహసీల్దార్ కేవీ రమణను వివరణ కోరగా తక్షణమే సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నీటిపారుదల శాఖ నూజివీడు డీఈఈ అర్జునరావును సంప్రదించగా అన్ని గ్రామాల్లో తోలకాలకు అనుమతులు ఇవ్వలేదని, అనుమతి లేకుండా మట్టి రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు