
శ్రమ పాత్ర కీలకం
ఏలూరు టౌన్: సమాజ పరిమాణం, అభివృద్ధిలో శ్రమ పాత్ర కీలకమని సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. స్థానిక టుబాకో మర్చంట్స్ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 60వ శ్రమ కావ్యం–గానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ ఆహ్వానం పలకగా జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్ తేజ తాను రచించిన శ్రమకావ్యం పుస్తకంలో అనేక ఘట్టాలను ఆలపిస్తూ సవివరంగా విశ్లేషించారు. రిటైర్డ్ రిజిస్ట్రార్ లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రమ కావ్యం రచనలో శ్రమను వస్తువుగా తీసుకుని రచన చేయడం సాహసోపేతం అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని సీఐటీయూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోందన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానం
భీమవరం : జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సోమవారం స్థానిక ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన 119 మంది, ఇంటర్లో ప్రతిభ చూపిన 34 మందికి అవార్డులు అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని, విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, రూ.20 వేలు చెక్ రూపంలో అందిస్తారన్నారు.
216 ఎన్హెచ్పై ఆంక్షలు
నరసాపురం: ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలు నుంచి మంగళవారం ఉదయం10 గంటలు వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నరసాపురం–మొగల్తూరు–మచిలీపట్నం మార్గంలో ట్రాఫిక్ దారి మళ్లించనున్నారు. దిగమర్రు నుంచి నరసాపురం, మొగల్తూరు మీదుగా మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు దిగమర్రు, పాలకొల్లు, భీమవరం, లోసరి మీదుగా మచిలీపట్నం చేరుకోవాలి. మచిలీపట్నం నుంచి నరసాపురం వచ్చే వాహనాలు ముత్యాలపల్లి సెంటర్ మీదుగా వారతిప్ప, వెంప, కొప్పర్రు, లిఖితపూడి. సరిపల్లి మీదుగా దారి మళ్లించారు. పాలకొల్లు నుంచి నరసా పురం మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలు భీమవరం, లోసరి చేరుకోవాలని మొగల్తూరు పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
రైల్వేస్టేషన్లో తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు ఆదివారం తనిఖీలు చేప ట్టారు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రత్నరాజు పర్యవేక్షణలో విజయవాడ లైన్ సర్కిల్ సీఐ ఎంవీ దుర్గారావు, ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. స్టేషన్లోని ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కార్యాలయం, ఆర్ఎంఎస్లో పూర్తిస్థాయిలో పరిశీలించారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారని, దీంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని ఎస్సై సైమన్ చెప్పారు.
నేడు పీజీఆర్ఎస్ రద్దు
ఏలూరు(మెట్రో): అనివార్య కారణాల వల్ల సోమవారం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

శ్రమ పాత్ర కీలకం

శ్రమ పాత్ర కీలకం