
గానుగ నూనె ధరల ఘాటు
తాడేపల్లిగూడెం: పచ్చళ్ల సీజన్ దాటిపోతున్నా నూనె ధరల సెగ వినియోగదారులను వదలడం లేదు. పామాయిల్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించినా అమ్మకందారులు మాత్రం సుంకం మేరకు ధరలు తగ్గించడం లేదు. ఇదిలా ఉండగా మార్కెట్లో లభించే నూనెల నాణ్యతపై వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లడంతో గానుగ నూనె వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు శీతలీకరణ పద్ధతి అంటూ ధరలకు టోకరా వేస్తున్నారు. దాదాపు కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు. అయితే గానుగ నూనెలో కూడా తేడాలు గమనించని విధంగా కల్తీలు జరుగుతున్నాయి. అలాగే నూనె కొలతలకు ప్రామాణికాలు లేకుండా పోయాయి. గతంలో కిలో నూనె ప్యాకెట్లు ఉండగా తర్వాత లీటరు (910 గ్రాములు) ప్యాకెట్లు వచ్చాయి. కచ్చితత్వ కొలతలకు తిలోదకాలిచ్చిన నేపథ్యంలో 800 గ్రాముల నుంచి 695 గ్రాముల వరకు నూనె ప్యాకెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి.
స్వల్పంగా తగ్గించి..
వంట నూనెల దిగుమతి సుంకాన్ని కేంద్రం 27 నుంచి 10 శాతానికి తగ్గించడంతో నూనెల ధరలు మార్కెట్లో స్వల్పంగా తగ్గాయి. లీటర్ పామాయిల్ రూ.130 నుంచి రూ.100కి, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.160 నుంచి రూ.143కు, రైస్బ్రాన్ ఆయిల్ రూ.150 నుంచి రూ.142కు, వేరుశనగ నూనె రూ.160 నుంచి రూ.150కు వచ్చింది. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ధరలు తగ్గించకుండా పాత ధరలనే కొనసాగిస్తున్నారు. గానుగ నూనె పేరుతో నాణ్యత అంటూ కిలో రూ.360 నుంచి రూ.380కు విక్రయిస్తూ వినియోగదారులకు టోపీ పెడుతున్నారు. తూనికల కొలతల శాఖ, అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు మార్కెట్లో నూనె శాంపిల్స్ తీసుకుని వినియోగదారులు మోసపోకుండా కట్టడి చేయాల్సి ఉంది.