
సింహవాహనంపై గ్రామోత్సవం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి నిత్యార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. వేదపారాయణం నిర్వహించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఉంచి మేళతాళాల నడుమ శ్రీస్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. దండు శ్రీనివాసరాజు, ఉమాలక్ష్మిదేవి దంపతుల సౌజన్యంతో శ్రీవెంకటేశ్వర సంబరం నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిపారు. పరిసర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
గోదావరిలో పడి యువకుడి మృతి
కుక్కునూరు: గోదావరిలో స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో దిగిన యువకుడు గోదావరిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని మాధవరం రేవు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన మొట్టెం చరణ్ (20) శనివారం మధ్యాహ్నం కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం గ్రామంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి హాజరయ్యాడు. భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో మాధవరం గ్రామంలో స్నేహితులు ఉండటంతో ఆగాడు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. దిగిన వారెవరికీ ఈత రాకపోవడం, చరణ్ లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
వివాహిత ఆత్మహత్య
మండవల్లి: భర్తతో గొడవపడి ఇంట్లో ఉరేసుకుని వివాహిత మృతి చెందినట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. పోలీసుల కథధనం ప్రకారం గున్ననపూడికి చెందిన సతీష్కు రాజేశ్వరితో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. శనివారం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం సతీష్ పనికి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన రాజేశ్వరి మధ్యాహ్నం రేకుల షెడ్డుకు ఉన్న రాడ్డుకు చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

సింహవాహనంపై గ్రామోత్సవం