
జాగా కనిపిస్తే చేపల చెరువులే
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా ఆక్వా చెరువులు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో చెరువుల జాతర ప్రారంభమైంది. శ్మశాన వాటిక స్థలాలను సైతం చేపల చెరువుల్లో కలిపేసుకుంటున్నారు. ఎప్పటి నుంచే అమలవుతున్న ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. రాజకీయ నాయకుడి మాటే చట్టంగా మారుతోంది. తప్పు జరుగుతోందని తెలిసినప్పుటికీ అధికారులు నోటీసిచ్చి పనైపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారు. ఈలోపు అనుమతులు లేకుండానే చేపల చెరువులు వెలుస్తున్నాయి. కై కలూరు మండల శివారు గ్రామం వేమవరప్పాడులో 10 వార్డులు ఉన్నాయి. మొత్తం 3,000 మంది జనాభా ఉన్నారు. కూలీ పనులపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో బస్టాప్ వెనుక 3 ఎకరాల్లో శ్మశాన వాటిక ఉంది. సమీపంలో బుర్ల సత్యనారాయణకు చెందిన సర్వే నంబరు 177/1, 2, 3, 13లో 2.99 ఎకరాల భూమిని చేపల చెరువుగా తవ్వుతున్నాడు. చెరువు రూపంలో వచ్చిన మట్టిని మైనింగ్కు విక్రయిస్తున్నారు. ఆక్వా చెరువు తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవు.
సర్పంచ్ మాటకు విలువ లేదు
గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ నున్న రాంబాబు శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకుని చెరువు తవ్వుతున్నారని, ప్రభుత్వ అనుమతులు లేవని ఏప్రిల్ 28న ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. శ్మశానంలో హిందూ సాంప్రదాయతో పాటు క్రైస్తవమతం తీసుకున్న కొందరు సమాధి చేస్తారు. ఆ సమయంలో సమీప చేపల చెరువులో ఊట నీరు బయటకొస్తే సమాధులకు ఇబ్బందులుంటాయని పేర్కొన్నారు. ఇదే కాకుండా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిర్వీర్యమవుతోందన్నారు. దీంతో ఈ నెల 6న ఫిషరీష్ ఏడీ రాజ్కుమార్ బుర్ల సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. పనులు మాత్రం ఇప్పటికీ ఆగలేదు.
నిబంధనలకు పాతర
కొత్త చెరువు తవ్వాలంటే 2019 మార్చి 16న విడుదలైన జీవో నంబరు7ను అమలు చేయాలి. 2020లో వచ్చిన అప్సడా యాక్టు నిబంధనలు పాటించాలి. నాన్ ఆక్వా జోన్లో రెవెన్యూ, ఫిషరీష్, వ్యవసాయం, ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి శాఖల అనుమతివ్వాలి. మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి కమిటీ అధికారులు డీఎల్సీలో అనుమతులు అందిస్తారు. వ్యవసాయ భూములు, తాగునీటి చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, శ్మశానాలు వంటి వాటికి 3 నుంచి 5 మీటర్ల దూరంలో చెరువులు తవ్వుకోవాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నా కేవలం రాజకీయ నాయకుడి అండతో చెరువులు తవ్వేస్తున్నారు. వేమవరప్పాడు విషయంలో వీఆర్వో రంగనాయకమ్మను వివరణ కోరగా.. చెరువు తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. షిషరీష్ సిబ్బంది మాత్రం రెవెన్యూ అధికారులు సహకరిస్తే అక్రమ పనులు అడ్డుకుంటామంటున్నారు.
వేమవరప్పాడులో శ్మశానాన్ని ఆక్రమించి తవ్వకం
ఎలాంటి అనుమతులూ లేకుండా పనులు
కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఆగని వైనం
నోటీసులు ఇచ్చాం
అనుమతులు లేకుండా వేమవరప్పాడులో చేపల చెరువు తవ్వుతున్న బుర్ల సత్యనారాయణకు మత్స్యశాఖ నుంచి నోటీసులు అందించాం. ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాలి. వేమవరప్పాడులో అక్రమ చెరువు తవ్వకం పనులు నిలుపుదలకు సిబ్బందిని పంపుతాం.
– బి.రాజ్కుమార్, మత్స్యశాఖ ఏడీ, కై కలూరు

జాగా కనిపిస్తే చేపల చెరువులే

జాగా కనిపిస్తే చేపల చెరువులే