
పీఎంఏజీవైలో రూ.1.20 కోట్ల మంజూరు
భీమవరం(ప్రకాశంచౌక్) : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీఎంఏజీవై పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020–21 సంవత్సరంలో పీఎంఏజీవై పథకం అమలుకు 50 శాతం పైగా ఎస్సీ జనాభా ఉన్న 10 గ్రామాలను, 2022–23 సంవత్సరంలో 40 శాతం పైగా ఎస్సీ జనాభా కలిగిన 11 గ్రామాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వీటిలో 6 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు మంజూరు చేశారన్నారు. మరో నాలుగు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించినట్లు చెప్పారు. ఇంకా గ్రామ అభివద్ధి ప్రణాళిక సమర్పించాల్సిన 11 గ్రామాలకు కూడా వీడీపీలు సమర్పించాలన్నారు. ఈ నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణాలు, విద్యుత్ తదితర అవసరాలకు వినియోగించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయరాజు, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఈవో ఇ.నారాయణ, డీఎం అండ్ హెచ్ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.