
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్ వెంటే..
మీడియాలో దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం
దెందులూరు: తాను ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే, వైఎస్సార్సీపీ కే పనిచేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. కొన్ని మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నట్టు చేసిన దుష్ప్రచారాన్ని శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకూ తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన వైస్ జగన్ తోనే తన పయనం అన్నారు. తనకు వైఎస్సార్ కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారాన్ని చేయటం బాధ కలిగించిందన్నారు. ఇది సిగ్గుచేటని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ సిటిజన్ల పోస్టుకార్డు ఉద్యమం
నరసాపురం: సీనియర్ సిటిజన్లకు గతంలో మాదిరిగా రైలు చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కోరుతూ అఖిల భారత సీనియర్ సిటిజన్స్ కార్పెడరేషన్ పిలుపులో భాగంగా శుక్రవారం సంఘం నరసాపురం శాఖ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలని ప్రధానికి పోస్టుకార్డులు రాసి పోస్టు చేశారు. పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయంలో తపాలా శాఖ అధికారికి మొదటి పోస్టుకార్డు అందించారు. సంఘం నరసాపురం శాఖ అధ్యక్షుడు అందే రంగారావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లను తగు విధంగా గౌరవించి, వారి సంక్షేమం చూ డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైలు చార్జీల్లో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు షేక్ సిలార్ సాహెబ్, పెన్మెత్స బాబూజీ, నెక్కంటి సుబ్బారావు, దాసిరి దేవరాజు, పితాని సత్యనారాయణ, కోట్ల చిరంజీవి పాల్గొన్నారు.
12న జాబ్మేళా
ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న అప్రెంటీస్, జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారితో పాటు ఫైనలియర్ విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కన్వీనర్ లేదా అప్రెంటీస్ అడ్వయిజర్ను సంప్రదించాలని కోరారు.
పని గంటల పెంపు నిర్ణయం తగదు
భీమవరం: రాష్ట్రంలో పని గంటలు పెంచేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు 44 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు తెచ్చిందని పేర్కొన్నారు. 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్న షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో 13 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగకపోగా, కనీస వేతనాల బోర్డును నియమించలేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించలేదని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని వీటిపై సీఎం చంద్రబాబు నోరు మెదపడటం లేదన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త లేబర్కోడ్స్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా మహిళలతో పనిచేయించేలా రూల్స్ రూపొందించడం అన్యాయమన్నారు. వీటిని అందరూ వ్యతిరేకించాలని కోరారు.
మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా కొనసాగుతుందని తెలిపారు.