
అభయారణ్యంలో అక్రమ పట్టుబడులు
సాక్షి, టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ సాగు యథేచ్ఛగా సాగుతోంది. సుప్రీం కోర్టు ఒక పక్క అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయాలని అటవీశాఖకు ఆదేశాలు ఇస్తున్న తూతూమంత్రంగా అక్రమ చెరువులకు గండ్లు కొట్టి మమా అనిపిస్తున్నారు. కై కలూరు మండలం చటాకాయి గ్రామంలోని కొల్లేరు అభయారణ్యంలో 355 ఎకరాల విస్తీర్ణంలో 9 చెరువుల్లో అక్రమ సాగు చేస్తున్నారు. వీటిలో నిషేధిత కోడి వ్యర్థాలతో సైతం సాగు జరుగుతోంది. చటాకాయి అక్రమ చెరువుల్లో గురువారం నుంచి పట్టుబడులు యథేచ్ఛగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల్లో రసాయనాలు అధికంగా వాడతారు. దీంతో కొల్లేరు పర్యావరణం మరింతగా పాడవుతోంది. చటాకాయిలో ఏకంగా చేపలు, రొయ్యలను కలపి అభయారణ్యంలో సాగు చేస్తున్నారు.
తూతూమంత్రంగా చెరువులకు గండ్లు
కై కలూరు మండలం చటాకాయి గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి(165) నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చటాకాయి చేరుకోవచ్చు. ఇటీవల అక్రమ చేపల చెరువులకు గండ్లు పెట్టడానికి అటవీశాఖ అధికారులు వస్తే చటాకాయి గ్రామం ప్రారంభంలోనే గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులతో చర్చలు జరిపి ఏదో విధంగా ఓ రెండు చెరువులకు అటవీ సిబ్బంది గండ్లు పెట్టారు. ఉన్నతాధికారులకు నివేదించడానికి చెరువు గట్టు గండ్లును ఫొటోలు తీసుకున్న తర్వాత తిరిగి చెరువు యథాస్థితికి చేరటం ఇక్కడ పరిపాటిగా మారింది.
లీజుల వాటాలు తీసేస్తున్నారు
గ్రామ పరిధిలో అక్రమ సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలో పురుషులు పంచుకుంటారు. ఏడాదికి ఒక్కో తలకు రూ.10,000 వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో వారి మాటకు ఎదిరించినవారిని, బయట ఊరి నుంచి వచ్చి స్థిరపడిన వారిని, పూర్వం మాజీ ముఖ్యమంత్రి జలగళం వెంగళరావు ఇచ్చిన సొసైటీ భూముల్లో పేర్లు లేవనే వంకతో దాదాపు 300 మందికి కొన్ని చెరువుల్లో లీజులు తీసివేశారు. ఇదే కాకుండా ఒకరికి రూ.10,000 లీజు వస్తేంటే మరొకరికి కేవలం రూ.1000 అందిస్తున్నారు. గ్రామ సర్పంచ్ కూడా బాధితుల లిస్టులో ఉండటం గమనార్హం. ఈ విషయమై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు లిఖిత పూర్వంగా ఫిర్యాదు సైతం చేశారు. అక్రమ చెరువుల్లో లీజులు సమానంగా పంచకపోతే, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసి చెరువుల మొత్తాన్ని ధ్వంసం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామస్తుల ఫిర్యాదుపై అతీగతి లేదు.
అమాయక ప్రజల జీవితాలతో ఆటలు
కొల్లేరు అమాయక ప్రజల జీవితాలతో నాయకులు ఆటలాడుతున్నారు. ఇదిగో కొల్లేరు ఇచ్చేస్తున్నారు? అదిగో కొల్లేరు కాంటూరు కుదించేస్తున్నారు? అంటూ చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు సుప్రీం నిబంధనల మేరకు గండ్లు కొట్టడానికి వెళితే గ్రామంలో మహిళలతో ధర్నాలు చేయించి, ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఈ గ్యాప్లో కొల్లేరులో పాత చెరువుల రిపేర్లు పేరుతో అందినకాడికి తవ్వేస్తున్నారు. ఇదేంటనీ అడిగే నాథుడే కనిపించడం లేదు. రెవెన్యూ, ఫారెస్టు అధికారులు అక్రమ పట్టబడులు, అనుమతులు లేని రిపేర్లు వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు.
రాజకీయ నేతల అండతో బరితెగింపు
కొల్లేరు గర్భానికి తూట్లు
చటాకాయి గ్రామంలో అక్రమ సాగుకు అంతే లేదు
అమలు కాని సుప్రీం కోర్టు నిబంధనలు
అక్రమ చెరువులకు గండ్లు కొట్టాం
కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులకు సుప్రీం కోర్టు ఆదేశాలతో గండ్లు కొట్టించాం. కొల్లేరు గ్రామాల ప్రజలకు ముందుగా సుప్రీం కోర్టు నిబంధనలపై అవగాహన కల్పించాం. కొల్లేరు అభయారణ్య చట్టాలను పరిరక్షించుకోవడం అందిరి బాధ్యత. కొల్లేరులో అక్రమ సాగు వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం.
– కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, ఏలూరు

అభయారణ్యంలో అక్రమ పట్టుబడులు

అభయారణ్యంలో అక్రమ పట్టుబడులు

అభయారణ్యంలో అక్రమ పట్టుబడులు