
త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై కేసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): రవాణా వాహనాలకు చెల్లించాల్సిన పన్ను గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసినప్పటికీ, కొందరు రవాణా వాహన యజమానులు త్రైమాసిక పన్ను చెల్లించకుండా వాహనాలను రహదారులపై తిప్పుతున్నారని డీటీసీ షేక్ కరీమ్ తెలిపారు. దీనిపై ఈ నెల ఒకటవ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రవాణా వాహనాలపై 115 కేసులు నమోదు చేసి, రూ.7.53 లక్షలను అపరాధ రుసుముగా విధించినట్లు చెప్పారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. వాహనంపై కేసు నమోదు చేస్తే పన్నుతో పాటు 200 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుందని, స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే పన్నుతో పాటు 50 శాతం మాత్రమే అదనంగా చెల్లిస్తే సరిపోతుందని కరీమ్ తెలిపారు. రవాణా వాహనాలకు క్రమం తప్పకుండా టాక్స్, బీమా చెల్లిస్తూ, పర్మిట్, పొల్యూషన్, ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని అయన వాహన యజమానులకు సూచించారు.
పోక్సో కేసు నమోదు
భీమవరం: పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ జి.కాళీచరణ్ తెలిపారు. వివరాల ప్రకారం రెండో పట్టణానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఆమెను 64 ఏళ్ల వయసున్న బాబూరావు ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
ధాన్యం లారీ బోల్తా
ఉంగుటూరు: ధాన్యం లారీ బోల్తా పడి ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకర్లమూడికి చెందిన రైతులు మార్నిడి వందనాదేవి, చేదునూరి శివపార్వతి, ఉర్రింకల వీరవెంకట సత్యవరప్రసాద్లకు చెందిన 500 సార్ల ధాన్యం ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలోని చంద్రావతి రైస్ అండ్ ఫ్లోర్మిల్లుకు తరలించేందుకు లారీలో లోడ్ చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు కాకర్లమూడి నుంచి బయలుదేరిన ఈ లారీ కొద్దిసేపటికే రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.

త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై కేసులు