
పేదల ఇళ్ల కూల్చివేత ఆపాలి
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు దౌర్జన్యంగా కూల్చడాన్ని తక్షణం విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పి–ఫోర్ పేరుతో పేదరిక నిర్మూలన అంటుంటే.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేదలను నిర్మూలించే చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్గా గౌరవ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు పేదల ఇళ్లు కూలుస్తామని బహిరంగంగా ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉండిలో రఘురామకృష్ణరాజే కోర్టు, పోలీసు, అధికారిగా వ్యవహరిస్తుంటే అధికారులు ఎమ్మెల్యేకి శిరస్సు వంచుతున్నారన్నారు. కూల్చిన పేదల ఇళ్లు తిరిగి నిర్మించి ఇవ్వాలని, పేదల ఇళ్ల కూల్చివేతను ఆపితే ఇది ముగింపు సభ.. లేకుంటే ప్రారంభ సభగా మారుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ మాట్లాడుతూ రఘురామ కృష్ణరాజు గద్దెనెక్కిన రోజు నుంచి పేదల ఇళ్లను కూల్చే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్రాజు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రత్నరాజు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, పీవీ రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్య వర ప్రసాద్, ఏపీ బహుజన జేఏసీ చైర్మన్ తాళ్లూరి మధు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు, కోనా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు